
బ్రిటన్ మహా రాణి క్వీన్ ఎలిజబెత్ II గురువారం సాయంత్రం మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె మృతి పట్ల ప్రపంచ వ్యాప్తంగా సంతాపం వెల్లువెత్తుతోంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు, దేశాధినేతలు, ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.
ఈ క్రమంలో క్వీన్ ఎలిజబెత్ గౌరవార్థం సెప్టెంబర్ 11న దేశవ్యాప్తంగా ఒకరోజు సంతాప దినం నిర్వహించాలని భారత ప్రభుత్వం ప్రకటించింది. కేవలం భారత్ లోనే కాదు.. 54 దేశాలలో సంతాప దినాలను పాటించనున్నారు. ఆయా దేశాల జాతీయ జెండాలను అవతనం చేయనున్నాయి. బ్రిటన్లో మాత్రం 10 నుంచి 12 రోజుల పాటు జాతీయ సంతాప దినాలుగా నిర్ణయించారు
కాగా, ఒడిశాకు చెందిన అంతర్జాతీయ సైకత శిల్పి మానస్ కుమార్ సాహూ తన ప్రత్యేక శైలిలో బ్రిటన్ రాణి ఎలిజబెత్-IIకి వీడ్కోలు పలికారు. అందమైన సాండ్ ఆర్ట్తో క్వీన్ ఎలిజబెత్ 2కు తనదైన రీతిలో నివాళులర్పించాడు. పూరీలోని గోల్డెన్ సీ బీచ్ లోని లైట్హౌస్ సమీపంలో ఇసుకతో క్వీన్ ఎలిజబెత్ II సైకత శిల్పాన్ని రూపొందించారు. ఈ సైకత శిల్పాన్ని రూపొందించడానికి మానస్ కుమార్ సాహు దాదాపు 5 గంటల పాటు శ్రమించారు. 10 అడుగుల పొడవున్న ఈ సైకత శిల్పాన్ని తయారు చేసేందుకు దాదాపు 5 టన్నుల ఇసుకను వినియోగించారు.
ఈ సైకత శిల్పంలో ఎలిజబెత్-II టోపీ ధరించినట్టు, మెడలో నెక్లెస్, బ్రూచ్, చెవిపోగులు వంటివి చాలా స్పష్టం కనిపించేలా రూపొందించాడు. ఈ సైకతశిల్పం అందరిని ఆకట్టుకుంటున్నది. ఈ సైకత శిల్పం దిగువ భాగంలో ట్రిబ్యూట్ టు క్వీన్ అని రాశాడు. అంతర్జాతీయంగా పేరుగాంచిన ఇసుక కళాకారుడు మానస్ కుమార్ సాహూ ఇలాంటి సందర్భాల్లో తన ఇసుక కళతో ప్రముఖులకు నివాళులర్పిస్తూనే ఉన్నారు.
సాహూ తన కళకు సంబంధించిన చిత్రాన్ని ట్విట్టర్లో షేర్ చేస్తూ.. "పూరీ బీచ్ ఒడిశాలో నా శాండ్ర్ట్ ద్వారా మహిమాన్విత క్వీన్ ఎలిజబెత్ IIకి నా హృదయపూర్వక నివాళి" అని రాశారు.
క్వీన్ ఎలిజబెత్ II గురువారం 96 సంవత్సరాల వయస్సులో మరణించారు. ఆమె బ్రిటన్ను ఎక్కువ కాలం పరిపాలించిన రాణిగా పేరుగాంచారు. ఆమె దాదాపు 70 ఏళ్ల పాటు ఈ పదవి బాధ్యతలు నిర్వర్తించారు. ఈ సమయంలో ఆమె బ్రిటన్లో 15 మంది ప్రధాన మంత్రులతో కలిసి పనిచేశారు. వీరిలో విన్స్టన్ చర్చిల్ నుండి మార్గరెట్ థాచర్ వరకు ఉన్నారు. అదే సమయంలో, బ్రిటన్ కొత్త ప్రధాని లిజ్ ట్రస్ను కూడా రాణి నియమించారు. క్వీన్ ఎలిజబెత్-II మరణం తర్వాత, ఆమె పెద్ద కుమారుడు కింగ్ చార్లెస్ III బ్రిటన్ కొత్త రాజు అయ్యాడు. శుక్రవారం బ్రిటన్ చక్రవర్తి హోదాలో మొదటిసారి బకింగ్హామ్ ప్యాలెస్కు వచ్చారు.