విచిత్రం.. ఇంట్లో కూడా హెల్మెట్టు పెట్టుకుంటున్న కుటుంబం...కరోనా కాదు కంకరరాళ్ల భయంతో...

By AN TeluguFirst Published Sep 3, 2021, 11:51 AM IST
Highlights

బర్రాలోని దామోదర్ నగర్ లో ఆదిత్య శర్మ అనే వ్యక్తి కుటుంబం నివసిస్తోంది. ఆ ఇంటి పై రెండు రోజులుగా రాళ్ల దాడి జరుగుతోంది. ఈ రాళ్లు ఎవరు విసురుతున్నారు? ఎందుకు విసురుతున్నారు? ఎవరికీ తెలియదు.  

ఉత్తరప్రదేశ్‌లో ఒక వింత ఘటన వెలుగు చూసింది. కాన్పూర్ కు చెందిన ఓ కుటుంబం ఇంట్లో కూడా హెల్మెట్ పెట్టుకుని తిరుగుతుంది. వాళ్లకు అదేం అలవాటు? అని ఆశ్చర్యపోకండి. ఎందుకంటే వారు ఎదుర్కొంటున్న సమస్య తెలిస్తే... మనం కూడా అదే పని చేయాల్సి వస్తుందని మీరు అంటారు. ఇంతకీ వాళ్లకు వచ్చిన సమస్య ఏంటో తెలుసా? మనిషి కనిపించకుండా ఆ ఇంటిపై రాళ్ల దాడి జరుగుతోంది.

బర్రాలోని దామోదర్ నగర్ లో ఆదిత్య శర్మ అనే వ్యక్తి కుటుంబం నివసిస్తోంది. ఆ ఇంటి పై రెండు రోజులుగా రాళ్ల దాడి జరుగుతోంది. ఈ రాళ్లు ఎవరు విసురుతున్నారు? ఎందుకు విసురుతున్నారు? ఎవరికీ తెలియదు.  రాళ్ల దాడిలో కిటికీల అద్దాలు పగిలిపోయాయి అని ఆదిత్య చెబుతున్నారు. ఎవరికి ఎప్పుడు గాయాలవుతాయో తెలియక ఇంట్లో కూడా హెల్మెట్ ధరించాల్సి వస్తుందని చెప్పారు.

మంగళవారం ఉదయం 9 గంటల నుంచి ఇంటిపై రాళ్ల దాడి జరుగుతున్నట్లు ఆదిత్య చెప్పారు. ఇంట్లో తిరుగుతున్నా, కిటికీ సమీపంలో ఉన్నా, బాల్కనీ లోకి వచ్చినా, చివరకు డాబా పైకి వెళ్లి బట్టలు ఆరేస్తున్న సమయంలో కూడా ఈ కుటుంబ సభ్యుల తలపై హెల్మెట్ తప్పనిసరిగా ఉంటుంది. ఈ విషయంలో పోలీసులకు కూడా ఆదిత్య ఫిర్యాదు చేశారు. కానీ ఎటువంటి ప్రయోజనం లేకపోయింది.

పోలీసులు ఆ ఇంటికి వచ్చినప్పుడు కూడా ఈ దాడి జరిగింది. కానీ బయట ఎవరూ లేరు. దీంతో రాళ్ల దాడి ఎవరు చేస్తుందీ కనుక్కోవడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ విషయం తెలిసిన స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.  ఎవరైనా యువకులు దూరం నుంచి క్యాట్ బాల్ లాంటి సాధనంతో రాళ్ల దాడి చేస్తున్నారేమో? అని అనుమానిస్తున్నారు.
 అయితే ఇప్పటివరకు ఈ దాడి ఎందుకు జరుగుతోంది? ఎవరు చేస్తున్నారు? అనే విషయాలు తెలియ లేదు.

click me!