
పశ్చిమ బెంగాల్ లో దారుణం జరిగింది. ప్రియురాలు, ప్రియుడి మధ్య వాగ్వాదం జరగడంతో యువతి కుటుంబ సభ్యులు ముందుగా ప్రియుడిని ఇంటికి పిలిపించారు. అక్కడ వారు కలవడం విషయం పక్కన పెడితే పెద్ద గొడవ జరిగింది. ఈ గొడవలో యువతి కుటుంబ సభ్యులు యువకుడి పెదాలని పదునైన ఆయుధంతో కోశారు. గాయపడిన యువకుడిని వైద్య చికిత్స కోసం బోల్పూర్ ఆసుపత్రిలో చేర్చారు. అయితే అతని చికిత్సలో ఆసుపత్రి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని యువకుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ దారుణ ఘటన పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్ జిల్లా బోల్పూర్లో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. బీర్భూమ్ జిల్లా బోల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాశీపూర్ గ్రామ నివాసి మోమినుల్ ఇస్లాం. అతను అదే గ్రామానికి చెందిన బోజో ఖాన్ కుమార్తెను ప్రేమించాడు. గత 5 ఏళ్లుగా వీరి ప్రేమ వ్యవహారం సాఫీగానే సాగింది. కానీ, ఇటీవల వీరిద్దరి మధ్య కొంతకాలంగా విభేదాలు తలెత్తాయి. వారిద్దరు ఎన్ని మాట్లాడుకున్నా పరిస్థితి సద్దుమణగలేదు.దీంతో ఆ యువతి జరిగిన విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో ప్రేమ వివాదాన్ని పరిష్కరించడానికి ప్రియురాలి కుటుంబ సభ్యులు ప్రియుడు మోమినుల్ ఇస్లాంను ఇంటికి పిలిపించారు. వారిద్దరి మధ్య సయోధ్య కుదర్చడానికి ప్రయత్నించారు. వారి మధ్య గొడవలను పక్కన పెట్టి.. పెళ్లి చేయాలని భావించారు. కానీ,ఏదో ఒక విషయంలో ఇరువర్గాల నుండి ఆరోపణలు , ప్రత్యారోపణలు మొదలయ్యాయి. ఆ చర్చ కాస్తా వాగ్వాదానికి దారి తీసింది. వివాదంగా మారడంతో ప్రియురాలి కుటుంబ సభ్యులు యువకుడిపై దాడి చేశారు.
ఈ క్రమంలో మొమినుల్ ఇస్లామ్ను మొదట తీవ్రంగా కొట్టారు. ఆ తర్వాత పదునైన ఆయుధంతో ఆ యువకుడి పెదవులను కోశారు. అతనికి తీవ్ర రక్తస్రావం జరిగింది. ఆ యువకుడు ఎలాగోలా తన ప్రియురాలి ఇంటి నుంచి తన ఇంటికి చేరుకోగా అతడి పరిస్థితి చూసి కుటుంబసభ్యులంతా చలించిపోయారు. వెంటనే బోల్పూర్లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతనికి ప్రథమ చికిత్స అందించారు. ఆ తర్వాత వైద్యుల సలహా మేరకు అతడ్ని ఇస్లాంను బోల్పూర్ సబ్ డివిజనల్ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటన బుధవారం జరగ్గా, వైద్యుల నిర్లక్ష్యంపై బంధువులు శుక్రవారం ఆందోళనకు దిగారు. దీంతో ప్రియుడి బంధువులు, స్థానికులు నిరసనకు దిగారు. యువకుడికి సరైన వైద్యం అందడం లేదని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోల్పూర్ సబ్ డివిజనల్ ఆస్పత్రిలో వైద్యసేవలు నాసిరకంగా ఉండడంతో వైద్యం అందడం లేదని ఆందోళనకారులు తెలిపారు. ఈ ఘటనపై ఆసుపత్రి అధికారులు విచారణ చేపట్టారు