
రైతుల నిరసనలు, ప్రభుత్వాన్ని విమర్శించే వారి ఖాతాలను బ్లాక్ చేయాలని భారత్ నుంచి సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ కంపెనీకి అనేక అభ్యర్థనలు వచ్చాయని ట్విట్టర్ మాజీ సీఈవో జాక్ డోర్సీ చేసిన ప్రకటన పచ్చి అబద్ధమని కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ యూట్యూబ్ షో 'బ్రేకింగ్ పాయింట్స్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో డోర్సీ చేసిన ఆరోపణపై కేంద్ర మంత్రి స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. బహుశా ట్విట్టర్ చరిత్రలోని అత్యంత అనుమానాస్పద కాలాన్ని తోసిపుచ్చడానికి డోర్సీ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
గతేడాది ట్విట్టర్ బోర్డు నుంచి వైదొలిగిన డోర్సీ ఇంటర్వ్యూలో.. కంపెనీపై విదేశీ ప్రభుత్వాల ప్రభావంపై అడిగినప్పుడు ‘‘నిరసనలు తెలిపే రైతులు, ప్రభుత్వాన్ని విమర్శించే నిర్దిష్ట పాత్రికేయులపై అభ్యర్థనలు చేసిన దేశాలలో భారతదేశం ఒకటి. ‘మేము చెప్పినట్టు చేయకపోతే మీ కార్యాలయాలను మూసివేస్తాం. భారత్ లో ట్విట్టర్ ను క్లోజ్ చేస్తాం. మీ ఉద్యోగుల ఇళ్లపై దాడులు చేస్తాం. ఇదీ భారత్, ప్రజాస్వామ్య దేశం.’’ అని అన్నారు.
ఈ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. డోర్సీ నేతృత్వంలోని ట్విటర్, ఆయన బృందం భారత చట్టాలను పదేపదే ఉల్లంఘిస్తోందని అన్నారు. వాస్తవానికి వారు (ట్విట్టర్) 2020 -2022 వరకు చట్టం ప్రకారం నడుచుకోలేదని అన్నారు. 2022 జూన్ నుంచి మాత్రమే నిబంధనలను పాటిస్తున్నారని తెలిపారు.
‘‘ఎవరూ జైలుకు వెళ్లలేదు, ట్విట్టర్ 'షట్డౌన్' కాలేదు. డోర్సీ ట్విటర్ పాలనలో భారత చట్ట సార్వభౌమత్వాన్ని అంగీకరించడంలో సమస్య ఉంది. భారత చట్టాలు తమకు వర్తించనట్లు ప్రవర్తించింది. సార్వభౌమ దేశంగా భారత్ లో కార్యకలాపాలు సాగిస్తున్న అన్ని కంపెనీలు చట్టాలను పాటించేలా చూసే హక్కు భారత్ కు ఉంది’’ అని అన్నారు.
2021 జనవరిలో రైతుల నిరసనల సమయంలో చాలా తప్పుడు వ్యాపించిందని కేంద్ర మంత్రి గుర్తు చేశారు. ఫేక్ న్యూస్ ఆధారంగా పరిస్థితిని మరింత రెచ్చగొట్టే అవకాశం ఉన్నందున, తప్పుడు సమాచారాన్ని ప్లాట్ ఫామ్ నుంచి తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ‘‘జాక్ పాలనలో ట్విట్టర్ లో పక్షపాత ధోరణి ఏ స్థాయిలో ఉండేదంటే, అమెరికాలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు వారు స్వయంగానే తొలగించేవారు. కానీ భారతదేశంలో తప్పుడు సమాచారాన్ని తొలగించడంలోనే వారికి సమస్య ఏర్పడింది’’అని మంత్రి అన్నారు.
ప్రభుత్వం ఎవరిపైనా దాడులు జరగలేదని, జైలుకు పంపలేదని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ‘‘భారతీయ చట్టాలకు అనుగుణంగా ఉండేలా చూడటంపైనే మా దృష్టి అంతా ఉంది. ఆ సమయంలో ట్విట్టర్ ఏకపక్షంగా, నిష్పక్షపాతంగా, వివక్షతో వ్యవహరించడం, తన ప్లాట్ఫారమ్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ వివరాలు ఇప్పుడు పబ్లిక్ డొమైన్ లో పుష్కలమైన ఆధారాలు ఉన్నాయి.’’ అని అన్నారు.
డోర్సీ నేతృత్వంలోని ట్విటర్ కేవలం భారత చట్టాలను ఉల్లంఘించడమే కాకుండా రాజ్యాంగంలోని ఆర్టికల్ 14,19ను ఉల్లంఘిస్తూ ఏకపక్షంగా కొందరిని 'డీఅంప్లిఫై', ‘డీ-ప్లాట్ఫామ్ ’ చేసిందని, తప్పుడు సమాచారాన్ని ఆయుధంగా మార్చడంలో కూడా పక్షపాతంగా వ్యవహరించిందని రాజీవ్ చంద్ర శేఖర్ అన్నారు. భారతదేశంలో పనిచేస్తున్న అన్ని మధ్యవర్తులకు తమ ప్రభుత్వ విధానాలు స్పష్టంగా ఉన్నాయని చెప్పారు. ఇంటర్నెట్ సురక్షితంగా, విశ్వసనీయంగా, జవాబుదారీగా ఉందని నిర్ధారించడానికి చట్టాలకు కట్టుబడి ఉండాలని తెలిపారు.