
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 28న కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. అయితే కాంగ్రెస్, వామపక్షాలు, టీఎంసీ, ఎస్పీ, ఆప్తో సహా 19 ప్రతిపక్ష పార్టీలు నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలని బుధవారం తమ నిర్ణయాన్ని ప్రకటించాయి. అయితే ప్రతిపక్ష పార్టీల చర్యను పెద్ద సంఖ్యలో బ్యూరోక్రాట్లు, అనుభవజ్ఞులు, విద్యావేత్తలు ఖండించారు. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనపై సంతకం చేసిన వారిలో 88 మంది రిటైర్డ్ బ్యూరోక్రాట్లు, 100 మంది అనుభవజ్ఞులు, 82 మంది విద్యావేత్తలు ఉన్నారు.
కొత్త పార్లమెంటు భవన ప్రారంభోత్సవాన్ని బహిష్కరించినందుకు ప్రతిపక్షాల చర్యలను తప్పుబట్టారు. భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే అన్నింటిని బహిష్కరించడానికి ఫ్యామిలీ ఫస్ట్ పార్టీలు కలిసి వచ్చాయని పేర్కొన్నారు. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం భారతీయులందరికీ ఇది గర్వించదగిన సందర్భం అయినప్పటికీ.. అపరిపక్వమైన, విచిత్రమైన, బూటకపు హేతువాదంతో అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడిన భారతదేశ ప్రధానమంత్రి.. తన ప్రామాణికత, సమ్మిళిత విధానాలు, వ్యూహాత్మక దృక్పథం, బట్వాడా చేయాలనే నిబద్ధతతో కోట్లాది మంది భారతీయులను ప్రేరేపించారు. అన్నింటికంటే ఆయన భారతీయత ‘‘కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలకు అసహ్యకరమైనది’’ అని వారు తెలిపారు. ప్రతిపక్ష పార్టీలు ‘‘ఫ్యామిలీ ఫస్ట్ బ్రాండ్ రాజకీయాలను’’ ప్రోత్సహిస్తున్నాయని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ‘‘ఇండియా ఫస్ట్’’ కోసం నిలబడాలని వారు సూచించారు.
ప్రభుత్వంపై కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష సభ్యులు ఉపయోగించిన నినాదానికి కౌంటర్గా.. ‘‘ప్రజాస్వామ్యం ఆత్మను పీల్చేది’’ ప్రతిపక్ష పార్టీలే అని వారు ప్రకటన ఆరోపించారు. పార్లమెంట్లో ఇటీవల జరిగిన పార్టీలకతీతమైన కార్యక్రమాలను ప్రతిపక్షాలు ఎన్నిసార్లు బహిష్కరించాయి అనేది మనసును కదిలించేదిగా ఉందని పేర్కొన్నారు.
‘‘2017లో సమాఖ్య ఆవిష్కరణ అయిన జీఎస్టీని ప్రారంభించేందుకు పార్లమెంటు అర్ధరాత్రి సమావేశాన్ని కాంగ్రెస్ బహిష్కరించింది. స్వాతంత్ర్యం తర్వాత భారతదేశంలో ఈ రకమైన ఏకైక ఆవిష్కరణ అది. అలాగే ఈ పార్టీలు 2020లో లోక్సభను బహిష్కరించి నీచమైన వికృత ప్రవర్తన కారణంగా సస్పెండ్ అయిన ఎనిమిది మంది రాజ్యసభ సభ్యులకు మద్దతు ఇచ్చాయి. ప్లకార్డులు పట్టుకోవడం, నినాదాలు చేయడం, దేశంలోని అతి ముఖ్యమైన సంస్థలను అగౌరవపరచడం, పాల ప్యాకెట్లు వంటి గృహోపకరణాలను నిరసనకు ప్రతిపక్షాలు ఉపయోగిస్తున్నాయి. ఇది ఘోర అవమానం. మన ప్రజాస్వామ్యంపై ప్రత్యక్ష దాడి’’ అని వారు పేర్కొన్నారు.
కేంద్ర బడ్జెట్-2023కు ముందు పార్లమెంటు ఉమ్మడి సెషన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేసిన సంప్రదాయ ప్రసంగాన్ని ప్రతిపక్షం బహిష్కరించిందని.. ఆమెను ‘‘రాష్ట్రపత్ని’’ అని పిలిచే ఈ కాంగ్రెస్ పార్టీ ఆమెకు చేసిన ‘‘అవమానాల కుప్పలు’’ ఎవరూ మరచిపోలేరని పేర్కొన్నారు. పార్లమెంటు భవన ప్రారంభోత్సవం యావత్ దేశం గర్వించదగ్గ ఘట్టం అని.. భారత ప్రజాస్వామ్యంలో అతిపురాతన రాజకీయ పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ అనవసరంగా ఏడవాలని నిర్ణయించుకోవడం అత్యంత నిరాశకు గురిచేసే అంశమని అన్నారు.
2012లో అప్పటి లోక్సభ స్పీకర్ మీరా కుమార్.. పార్లమెంటు భవనం పగుళ్లు, అత్యవసర చర్యలు లేకపోవడంతో నిశ్శబ్దంగా ఏడుస్తోందని గమనించారని.. కొత్త పార్లమెంటు భవనాన్ని కలిగి ఉండాలనే డిమాండ్ పాతదని పేర్కొన్నారు. కాంగ్రెస్పై దాడి చేస్తూ.. ‘‘ప్రస్తుత కాంగ్రెస్ స్వభావం ఎప్పుడూ అప్రజాస్వామికం.. వారి ఆత్మగౌరవం ఎల్లప్పుడూ దేశం పురోగతికి అడ్డుగా ఉన్నాయి. దేశం పక్షాన నిలబడాలని.. ప్రధాని నరేంద్ర మోడీకి అండగా నిలవాలని మేము సంకల్పిస్తున్నాము. భారతీయులుగా.. కేవలం భారతీయులుగా’’ అని పేర్కొన్నారు.
ఇక, ఎన్ఐఏ మాజీ డైరెక్టర్ వైసీ మోదీ, మాజీ ఐఏఎస్ అధికారులు ఆర్డీ కపూర్, గోపాల్ కృష్ణ, సమీరేంద్ర ఛటర్జీ, లింగయ్య యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అనిల్ రాయ్ దూబే సంయుక్త ప్రకటన విడుదల చేసిన వారిలో ఉన్నారు.