
ఎన్నికల సంఘం పూర్తిగా రాజీపడిందని శివసేన (యుబిటి) నాయకుడు ఆదిత్య థాకరే ఆదివారం ఆరోపించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని వర్గాన్ని శివసేనగా గుర్తించి దానికి విల్లు , బాణం గుర్తును కేటాయించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని అన్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో "సిఎం"(చీఫ్ మినిస్టర్) అంటే.."కరెప్ట్ మ్యాన్"(అవినీతిపరుడు)గా మారిందని ఎద్దేవా చేశారు. చట్టవిరుద్ధమైన, రాజ్యాంగ విరుద్ధమైన ముఖ్యమంత్రి కచ్చితంగా వెళ్లాల్సిందేనన్నారు.
ఉత్తర ముంబైలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆదిత్య ఠాక్రే మాట్లాడుతూ.. శివసేన (యుబిటి)కి కేటాయించిన టార్చ్ గుర్తు ఒక్కటే ద్రోహం, వెన్నుపోటు కారణంగా ఏర్పడిన చీకటిని పారద్రోలుతుందని ఆయన అన్నారు. కొవిడ్-19 మహమ్మారిని ఎదుర్కోవడంలో, తుపాను, అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతుల కష్టాలను తీర్చే పనిలో ప్రభుత్వం నిమగ్నమైతే.. ప్రభుత్వాన్ని కూల్చివేసే పనిలో షిండే నేతృత్వంలోని తిరుగుబాటు ఎమ్మెల్యేలు పని చేశారని ఆయన అన్నారు.
మహా వికాస్ అఘాడి ప్రభుత్వం మహారాష్ట్రను స్వర్ణయుగానికి తీసుకెళ్తోందని మాజీ మంత్రి అన్నారు. రెండున్నరేళ్ల ఎంవీఏ హయాంలో రూ.6.5 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా, 93 శాతం పెట్టుబడి ప్రతిపాదనలు అమలు చేశారు. ప్రభుత్వాన్ని పడగొట్టడం తప్పా .. బీజేపీ చేసిందేముందని థాకరే అన్నారు. రైతులకు రుణమాఫీ చేయడమే ఎంవీఏ ప్రభుత్వం అతి ముఖ్యమైన కర్తవ్యమన్నారు. ద్రోహం చేయడం మహారాష్ట్రకు ఇష్టం లేదని, అందుకే స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు వర్లి ఎమ్మెల్యే అన్నారు.
ముంబై పౌర ఎన్నికలు ఎప్పుడు జరిగినా శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే) విజయం సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. షిండే క్యాంపులో చేరిన 40 మంది ఎమ్మెల్యేలలో ఎవరూ డబ్బులు తీసుకోలేదని స్పష్టంగా చెప్పలేదని ఆదిత్య ఠాక్రే చెప్పారు. ఉద్ధవ్ ఠాక్రేకు ద్రోహం చేసిన 40 మంది ఎమ్మెల్యేలు ఎవరని ఆయన ప్రశ్నించారు. వారు ప్రజలకు , రాష్ట్రానికి ఎలా నిజాయితీగా ఉంటారని ప్రశ్నించారు.