Election 2024: ఎన్నికల భారతం.. 96 కోట్లమంది అర్హులే..! 

By Rajesh KarampooriFirst Published Jan 27, 2024, 5:46 AM IST
Highlights

Lok Sabha Election 2024: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో 47 కోట్ల మంది మహిళలతో సహా 96 కోట్ల మంది ప్రజలు ఓటు వేయడానికి అర్హులని భారత ఎన్నికల సంఘం తెలిపింది.  

Lok Sabha Election 2024: 2024 లోక్‌సభ ఎన్నికలకు ఎన్నికల సంఘం (ఈసీఐ) సంసిద్దమవుతోంది. అధికార యంత్రాంగం ఈ ప్రక్రియలో నిమగ్నమయ్యారు. మరోవైపు రాజకీయ పార్టీలూ ప్రచార వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ తరుణంలో ప్రపంచంలో ఏ ఇతర దేశాల ఎన్నికలతో సరిపోలని గణాంకాలను ఎన్నికల సంఘం వెల్లడించింది. రానున్న ఎన్నికల్లో దాదాపు 96 కోట్ల మంది ఓటర్లు ఓటు వేయడానికి అర్హులని భారత ఎన్నికల సంఘం తెలిపింది.

ఇందుకోసం 12 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికల నిర్వహణకు ఈ కేంద్రాలన్నింటిలో 1.5 కోట్ల మంది సిబ్బందిని నియమించనున్నారు. అర్హులైన 96 కోట్ల మంది ఓటర్లలో 47 కోట్ల మంది మహిళలు ఉన్నారని ఈసీ తెలిపింది. కాగా, పురుషుల సంఖ్య 48.99 కోట్లు. 48 వేల మంది థర్డ్ జెండర్లు ఉన్నట్లు తెలిపింది. 2019తో పోలిస్తే ఓటర్ల సంఖ్య 5.3 శాతం పెరిగింది. గత లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 91.2 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం.

Latest Videos

ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికలు 

ఎన్నికల సంఘం గణాంకాల ప్రకారం 1.73 కోట్ల మంది ఓటు హక్కు కలిగిన వారు 18 నుంచి 19 ఏళ్ల మధ్య వయస్కులే. 18వ లోక్‌సభ సభ్యులను ఎన్నుకునేందుకు పార్లమెంటు ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు 1.5 కోట్ల మంది పోలింగ్ సిబ్బందిని నియమించనున్నారు. 

మరోవైపు.. 81 లక్షల మంది వికలాంగ ఓటర్లు ఉండగా.. 1 కోటి 75 లక్షల మంది ఓటర్లు 80 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గలవారనీ, 80 ఏళ్లు పైబడిన 1 కోటి 75 లక్షల మంది ఓటర్లు ఉన్నారని తెలిపింది. అలాగే..  దాదాపు 2 లక్షల మంది ఓటర్లు 100 ఏళ్లు పైబడిన వారని వెల్లడించింది.
 
2024 లో ఆహ్లాదకరమైన ఓటింగ్ అనుభవాన్ని అందించడానికి ECI కట్టుబడి ఉందని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో కూడా తన స్థాయిని కల్పించేందుకు ఆయన కట్టుబడి ఉన్నారు. ప్రపంచంలో మరెక్కడా ఇంత పెద్ద ఎత్తున ఓటర్లు, లాజిస్టిక్స్ ఉన్న దేశం మరోకటి లేదని తెలిపారు. 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని  ఎన్నికల సంఘం తన నివేదికను వెల్లడించింది. 

ఎన్నికల కమీషనర్ అనూప్ చంద్ర పాండే మాట్లాడుతూ..1952లో 17.32 కోట్ల మంది ఓటర్లు ఉన్నారనీ.. నేడు ఈ సంఖ్య 96 కోట్లకు చేరిందని తెలిపారు. వీరిలో 47 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. తొలి సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ శాతం 45% ఉండగా, గత సార్వత్రిక ఎన్నికల్లో 67%కి పెరిగింది. ఇంత జరిగినా 30 కోట్ల మంది ఓటు వేయడానికి ముందుకు రావడం లేదని తెలిపారు. ఓటింగ్ శాతం పెంపు విషయానికొస్తే.. పట్టణ ప్రజల్లో ఆసక్తి లేకపోవడం, యువత ఉదాసీనత, వలస కార్మికులు ప్రధాన సవాళ్లుగా మారాయి. 

click me!