అర్పితా ముఖర్జీ మరో ఇంట్లో రూ. 28 కోట్ల నగదు.. బాత్‌రూమ్‌లో కూడా నోట్ల కట్టలు..

Published : Jul 28, 2022, 09:41 AM IST
అర్పితా ముఖర్జీ  మరో ఇంట్లో రూ. 28 కోట్ల నగదు.. బాత్‌రూమ్‌లో కూడా నోట్ల కట్టలు..

సారాంశం

పశ్చిమ బెంగాల్‌లో సంచలనం సృష్టించిన స్కూల్ సర్వీస్ కమిషన్ రిక్రూట్‌మెంట్ కుంభకోణం కీలక మలుపులు తిరుగుతుంది. అర్పితా ముఖర్జీకు చెందిన మరో ఇంట్లో దాదాపు రూ. 28 కోట్ల నగదు, 5 కిలోల బంగారు ఆభరణాలు, భూములకు సంబంధించిన పత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది.   

పశ్చిమ బెంగాల్‌లో సంచలనం సృష్టించిన స్కూల్ సర్వీస్ కమిషన్ రిక్రూట్‌మెంట్ కుంభకోణం కీలక మలుపులు తిరుగుతుంది. మంత్రి పార్థా ఛటర్జీ సన్నిహితురాలైన అర్పితా ముఖర్జీ ఇంట్లో ఇప్పటికే రూ. 21. 20 కోట్ల నగదును ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆమెకు చెందిన కోల్‌కోతాలోని బెల్ఘరియా ఫ్లాట్ నుంచి దాదాపు రూ. 28 కోట్ల నగదు, 5 కిలోల బంగారు ఆభరణాలు, భూములకు సంబంధించిన పత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. 

ఈడీ అధికారులు బుధవారం సాయంత్రం అర్పిత నివాసం‌ ఇంటి తాళాన్ని పగలగొట్టి లోనికి ప్రవేశించారు. అయితే వారు అక్కడ భారీగా నగదు కనుగొన్నారు.  ఆ నగదును లెక్కించడానికి వారు వెంటనే కోల్‌కతాలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయాన్ని సంప్రదించారు. అరగంట వ్యవధిలో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన నలుగురు అధికారులు ఒకేసారి 1,000 నోట్లను లెక్కించగల నాలుగు జంబో కరెన్సీ లెక్కింపు యంత్రాలతో వచ్చారు. దాదాపు 8 గంటల పాటు ఆమె నివాసంలో తనిఖీలు చేపట్టినట్టుగా నివేదికలు సూచిస్తున్నాయి. 

ఆమె నివాసంలో పట్టుబడ్డ దాదాపు రూ.28 కోట్ల నగదుతో 10 ట్రంక్‌లను నింపిన తర్వాత ఈడీ అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ ట్రంక్‌లను అక్కడి నుంచి తరలించారు. మీడియా రిపోర్ట్స్ ప్రకారం.. గదుల్లోనే కాదు, ఫ్లాట్‌లోని బాత్రూమ్‌లో కూడా డబ్బు దాచి ఉంచారని.. వాటిని కూడా ఈడీ స్వాధీనం చేసుకున్నారని సమాచారం. తాజా సోదాల్లో లభించిన మొత్తంతో అర్పితా ముఖర్జీ రెండు నివాసాల్లో లభించిన నగదు దాదాపు రూ. 50 కోట్లుగా ఉంది.  దీంతో అర్పితా ముఖర్జీని  మరింత కష్టాల్లో పడినట్టయింది. ఇక, ఎస్ఎస్‌సీ రిక్రూట్‌మెంట్ కుంభకోణం కేసులో అవకతవకలపై దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారులు.. గత శనివారం రోజున అర్పితా ఛటర్జీని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 

ఇదిలా ఉంటే.. జూలై 22న దక్షిణ కోల్‌కతాలోని అర్పితా ముఖర్జీ డైమండ్ పార్క్ హౌసింగ్ కాంప్లెక్స్ నివాసం నుంచి రూ. 70 లక్షల విలువైన విదేశీ నగదును, రూ. 90 లక్షల విలువైన బంగారు ఆభరణాలతో పాటు రూ. 21.20 కోట్ల విలువైన నగదును.. ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పలు హై- ఎండ్ ఆపిల్ ఐఫోన్‌లతో పాటు, పలు ఆస్తి పత్రాలు, వాహనాల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మరుసటి రోజు పశ్చిమ బెంగాల్ ప్రైమరీ ఎడ్యుకేషన్ బోర్డ్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌కు సంబంధించి పార్థ ఛటర్జీని ఈడీ అరెస్టు చేసింది. అలాగే అర్పితా ముఖర్జీని కూడా అరెస్టు చేశారు. ఇక, పార్థ ఛటర్జీ తన ఇంటిని మినీ బ్యాంక్‌గా ఉపయోగించుకున్నారని అర్పితా ముఖర్జీ ఈడీ అధికారులతో పేర్కొన్నట్లు నివేదికలు వెలువడుతున్నాయి. 

ఈ కేసు బెంగాల్‌లో అధికార తృణమూల్ కాంగ్రెస్‌ను, ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఇబ్బందుల్లోకి నెట్టింది. సీఎం మమతా బెనర్జీ టార్గెట్‌గా ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. మరోవైపు దోషులుగా తేలితే బాధ్యుతలపై చర్యలు తీసుకోవాలని మమతా బెనర్జీ ఇదివరకే చెప్పారు. టీఎంపీపై బీజేపీ చేస్తున్న ప్రచారాన్ని ఆమె ఖండించారు. 
 

PREV
click me!

Recommended Stories

Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు