
విదేశీ మారక ద్రవ్య చట్టం (ఫెమా) నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను జాతీయ మీడియా సంస్థ ఎన్డీటీవీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసింది. ఎన్డీటీవీకి అందిన రూ.1637 కోట్ల విదేశీ పెట్టుబడులు, మరో రూ.2732 కోట్ల విదేశీ పెట్టుబడులకు సంబంధించి ఫెమా ఉల్లంఘనలకు పాల్పడినట్లు ఈడీ తెలిపింది.
దీని కింద ఎన్డీటీవీ వ్యవస్థాపకులు, ఎగ్జిక్యూటీవ్ కో-ఛైర్పర్సన్స్ ప్రణయ్ రాయ్, రాధికా రాయ్, జర్నలిస్ట్ విక్రమ చంద్ర సహా ఇతరులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ ప్రకటించింది. ఎన్డీటీవీ సేకరించిన విదేశీ పెట్టుబడులకు సంబంధించి ఆయా నివేదికలు, సమాచారాన్ని ఆర్బీఐకి సమర్పించడంలో ఆలస్యాన్ని నోటీసులో పేర్కొంది.
రూ.600 కోట్లు మించిన విదేశీ పెట్టుబడులకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదముద్ర అవసరమని... ఈ అత్యున్నత స్థాయి కమిటీ అనుమతి లేకుండానే ఎన్డీటీవీ గ్రూప్ రూ.725 కోట్ల ఎఫ్డీఐ సమీకరించిందని... రూ.600 కోట్లకు తక్కువగా ఎఫ్డీఐని చూపడం భారీ కుట్రలో భాగమని ఈడీ ఆరోపించింది.