
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎంపీ రాహుల్ గాంధీలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు పంపింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ వీరిద్దరికీ నోటీసులు పంపి.. ఏజెన్సీ ముందు హాజరవ్వాలని ఆదేశించింది. నేషనల్ హెరాల్డ్ కేసు మనీ లాండరింగ్కు సంబంధించినది. సోనియా గాంధీని ఈ జూన్ నెల 8వ తేదీన, రాహుల్ గాంధీని జూన్ 2వ తేదీన ఏజెన్సీ ముందు హాజరవ్వాలని నోటీసుల్లో ఈడీ పేర్కొంది.
2011-12లకు చెందిన నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె తనయుడు రాహుల్ గాంధీలకు తాజాగా హాజరవ్వాలని ఈడీ ఆదేశించింది.
కాంగ్రెస్ నేత అభిషేక్ మను సంఘ్వీ ప్రకారం, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను 8వ తేదీ లోపు ఈడీ ముందు హాజరవ్వాలని ఏజెన్సీ నోటీసులు పంపింది. సోనియా గాంధీ తప్పకుండా ఈడీ ముందు హాజరు అవుతారని, కానీ, రాహుల్ గాంధీ విదేశాల్లో ఉన్నారని ఆయన వివరించారు. అంతలోపు రాహుల్ గాంధీ స్వదేశానికి తిరిగి వస్తే.. తప్పకుండా ఈడీ ముందు హాజరు అవుతారని తెలిపారు. కాగా, ఈడీ ముందు హాజరు కావడానికి రాహుల్ గాంధీ మరి కొంత సమయా న్ని కోరినట్టు ఇండియా టుడే కథనం పేర్కొంది.
కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా మాట్లాడుతూ, నేషనల్ హెరాల్డ్ కేసు తరుచూ టార్గెట్ చేస్తూ బీజేపీ ఫ్రీడమ్ ఫైటర్లను అవమానిస్తున్నదని విమర్శించారు. స్వాతంత్ర్య సమరంలో బీజేపీకి సంబంధించిన వారెవరూ లేకపోవడమే ఇందుకు కారణం అంటూ విమర్శలు చేశారు. నేషనల్ హెరాల్డ్ పేపర్ను 1942లో ప్రారంభించారని వివరించారు. ఆ సమయంలో బ్రిటీషర్లు ఆ పేపర్పై తీవ్ర ఒత్తిడి తెచ్చారని, దాన్ని మూసేయడానికి కుట్రలు చేశారని పేర్కొన్నారు. నేడు మోడీ ప్రభుత్వం కూడా నేషనల్ హెరాల్డ్పై అదే వైఖరి అవలంభిస్తున్నదని విమర్శించారు.
అసలు దేశంలో మనీ లాండరింగ్ అనేదే లేని కాలంలోనే మనీ లాండరింగ్ అని కేసు పెట్టారని, ఇది కేవలం రాజకీయ కుట్ర అని ఆరోపణలు చేశారు.