ప్రధాని మోడీ జోక్యంతో ఉక్రెయిన్ యుద్ధం తాత్కాలికంగా ఆగింది: కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్

By Mahesh KFirst Published Jan 11, 2024, 3:29 PM IST
Highlights

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జోక్యంతో రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నాలుగైదు గంటల విరమణ జరిగింది. ఈ సమయంలోనే ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారత విద్యార్థులను సురక్షితంగా భారత్‌కు తరలించినట్టు కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు.
 

PM Modi: కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ లండన్‌లో పర్యటిస్తున్నారు. అక్కడ పౌరులను ఉద్దేశించి బుధవారం మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ప్రశంసలు కురిపించారు. రష్యా, ఉక్రెయిన్ యుద్దం తాత్కాలికంగా నిలిపేయడంలో ప్రధాని మోడీ సక్సెస్ అయ్యారని వివరించారు. తద్వార ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారత విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తరలించగలిగామని తెలిపారు.

రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైనప్పుడు ఉక్రెయిన్ దేశంలో చాలా మంది భారతీయ విద్యార్థులు చిక్కుకున్నారని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. వారిని స్వదేశానికి తీసుకురావడం పెద్ద టాస్క్‌గా మారిందని వివరించారు. అప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా రంగంలోకి దిగారని పేర్కొన్నారు. ఆయనే స్వయంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీతో మాట్లాడారని వివరించారు.

Latest Videos

Also Read: Praja Palana: ప్రజా పాలన పేరుతో సైబర్ మోసాలు.. ఫోన్‌కు కాల్, మెస్సేజీ వచ్చిందా? జాగ్రత్త!

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారత విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తరలించడానికి కొన్ని గంటలపాటు యుద్ధాన్ని విరమించాలని ప్రధాని మోడీ వారిద్దరినీ కోరారని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. వీరితో నడిపిన దౌత్య వ్యవహారంతో రష్యా, ఉక్రెయిన్ యుద్ధం తాత్కాలికంగా నాలుగు నుంచి ఐదు గంటలపాటు విరమణ సాధ్యమైందని వివరించారు. అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తోనూ ప్రధాని మోడీ మాట్లాడారని పేర్కొన్నారు. ఆ సమయంలో యుద్ధ విరమణకు ఆటంకం కలిగే నిర్ణయాలు తీసుకోరాదని కోరారని తెలిపారు. 

ఈ సమయంలోనే భారత విద్యార్థులను ఉక్రెయిన్ దేశం నుంచి సురక్షితంగా స్వదేశానికి తీసుకురాగలిగామని కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వివరించారు. ఆపరేషన్ గంగా కింద మొత్తం 80 విమానాలను నడిపామని తెలిపారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారత విద్యార్థులను రొమేనియా, హంగరీ, పోలాండ్, స్లోవేకియా సరిహద్దులకు తీసుకువచ్చి.. అక్కడి నుంచి భారత్‌కు తీసుకువచ్చారు.

click me!