Dolo-650: డోలో-650` తయారీ దారులు.. దానిని ప్రిస్క్రైబ్ చేసిన వైద్యులకు రూ.1000 కోట్ల విలువైన ఉచిత బహుమతులు ఇచ్చారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై సుప్రీం కోర్టు ఆగ్రహించింది.
Dolo-650: దగ్గు వచ్చినా.. తమ్ము వచ్చినా.. జర్వం వచ్చినా.. లేదా తలనొప్పి వచ్చినా.. అన్నింటికీ ఏకైక దివ్యౌషధం Dolo-650. ఈ మధ్య కాలంలో ఎక్కువగా అమ్ముడుపోయిన ట్యాబ్లెట్లలో Dolo-650 ఒకటి.. ఈ టాబ్లెట్ మన జాతీయ ఔషధంగా మారిందనడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా కరోనా కష్ట కాలంలో.. ఈ టాబ్లెట్ కు ఉన్నా క్రేజ్ మామూలుగా కాదు.. హాట్ కేకుల్లా అమ్ముడుపోయింది. Dolo-650 నో స్టాక్ అనే బోర్డులు పెట్టారంటే.. అతిశయోక్తి కాదు.. అంతలా డిమాండ్ పెరిగింది. ఎలాంటి లక్షణాలు కనిపించినా Dolo-650 వేసుకోవడం అలవాటుగా మారింది. ప్రతి ఇంట్లో ఏం ఉన్నా లేకున్నా Dolo-650 మాత్రం తప్పక ఉండేదంటే.. Dolo-650 వాడకం ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
అయితే.. Dolo-650 అమ్మకాలు అంతలా పెరగటం వెనుక రహస్యముందనీ, డోలో-650 తయారీదారులు ఈ ట్యాబ్లెట్ను ప్రిస్క్రైబ్ చేయడానికి డాక్టర్లకు రూ.1,000 కోట్ల విలువైన బహుమానాలు ఇచ్చినట్లు మెడికల్ రిప్రజెంటేటివ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా' (FMRAI) ఆరోపిస్తుంది. ఈ విషయం గురువారం సుప్రీంకోర్టుకు తెలిపింది. రోగులకు డ్రగ్స్ సిఫార్సు చేయించడం కోసం ఫార్మా కంపెనీలు వైద్యులకు ఎలాంటి ఉచితాలు అందించకుండా నిరోధించాలంటూ ఫెడరేషన్ ఆఫ్ మెడికల్, సేల్స్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) విచారణ నివేదికను సుప్రీంకోర్టుకు నివేదించింది. ఇందులో డోలో 650 ట్యాబ్లెట్లను తయారుదారులు.. ఈ టాబ్లెట్ ను ప్రిస్క్రైబ్ చేసిన వైద్యులకు ఉచితంగా రూ.1000 బహుమతులు పంపిణీ చేసిందనే ఆరోపణలు వచ్చాయి.
ఈ పిటిషన్ ను విచారించిన న్యాయమూర్తులు DY చంద్రచూడ్, AS బోపన్నలతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది తీవ్రమైన అంశంగా పేర్కొంది. డోలో 650 అమ్మకాల అంశంలో ఫార్మా కంపెనీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీరు చెప్పేది వినడానికి వినసొంపుగా లేదు. నాకు కరోనా సోకిన సమయంలో కూడా సరిగ్గా ఇదే వాడాలని చెప్పారు. ఇది తీవ్రమైన సమస్య.. మేము దానిని పరిశీలిస్తామని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అలాగే ఈ విషయంపై వారం రోజుల్లో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశించారు. 10 రోజుల తర్వాత ఈ అంశాన్ని మళ్లీ విచారిస్తామని తెలిపారు. ఈ కేసు తదుపరి విచారణను కోర్టు సెప్టెంబర్ 29కి వాయిదా వేసింది.
ఇదిలా ఉండగా, ఫార్మా కంపెనీల తరపున ఇంటర్వెన్షన్ పిటిషన్ దాఖలు చేసేందుకు న్యాయవాది కోర్టు అనుమతి కోరగా, దానిని కోర్టు మంజూరు చేసింది. ఈ అంశంపై ఫార్మా కంపెనీల పక్షం కూడా వినాలనుకుంటున్నట్లు ధర్మాసనం పేర్కొంది.