
సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ మరణంతో ఖాళీ అయిన ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురి పార్లమెంట్ స్థానానికి ఎన్నిక నిర్వహించేందుకు ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 5వ తేదీన మెయిన్పురి ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలోనే మెయిన్పురి లోక్సభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికకు సమాజ్వాదీ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ను ఈ ఉప ఎన్నిక బరిలో దింపింది. ఈ మేరకు ఆ పార్టీ అధికారిక ప్రకటన చేసింది. డింపుల్ యాదవ్ (42) కన్నౌజ్ నుండి రెండుసార్లు లోక్సభ సభ్యురాలుగా గెలుపొందారు. అయితే 2019లో ఆమె ఓడిపోయారు.
ఇక, కేంద్ర ఎన్నిక సంఘం ప్రకటన ప్రకారం.. మెయిన్పురి ఉప ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ నవంబర్ 10 న జారీ చేయబడుతుంది. అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడానికి నవంబర్ 17 చివరి తేదీ. అదేవిధంగా.. నవంబర్ 18న నామినేషన్ల పరిశీలన జగనుంది. అభ్యర్థులు నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 21 చివరి తేదీ. డిసెంబర్ 5న పోలింగ్ నిర్వహించనున్నారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటు డిసెంబర్ 8న మెయిన్పురి లోక్సభ ఉప ఎన్నిక ఫలితాలు వెలువడనున్నాయి.
మెయిన్పురి లోక్సభ స్థానంలో 1996లో ములాయం సింగ్ యాదవ్ మొదటిసారి గెలిచినప్పటి నుంచి అక్కడ సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థులు ప్రతి లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించింది. 2019లో ఇక్కడి నుంచి పోటీ చేసిన ములాయం సింగ్ యాదవ్ విజయం సాధించారు. అక్కడ బీజేపీ అభ్యర్థికి 4.3 లక్షల ఓట్లు రాగా, ములాయం సింగ్ యాదవ్కు 5.2 లక్షల ఓట్లు వచ్చాయి. ఆయన 94,000 మెజారిటీతో గెలుపొందారు. అయితే ఇదే స్థానంలో 2014లో ములాయం సింగ్ యాదవ్ 3.6 లక్షల మెజారిటీతో విజయం సాధించారు.
ఇక, మెయిన్పురి లోక్సభ స్థానంలో పరిధిలో ఐదు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉన్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో.. ఈ ఐదు అసెంబ్లీ స్థానాల్లో సమాజ్వాదీ పార్టీ మూడింటిని గెలుచుకోగా, బీజేపీకి రెండు స్థానాలు లభించాయి.