కంటికి రెప్పలా కాపాడుకునే కన్నతండ్రి తన 11 నెలల చిన్నారి పాలిట యముడయ్యాడు. ఉద్యోగం లేదన్న కారణంతో తన సొంత బిడ్డను హతమొందించి.. నదిలోకి విసిరేశాడు.
తాను జన్మనిచ్చిన బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకునే కన్నతండ్రి.. రాక్షసుడయ్యాడు. ఓ వ్యక్తి తన 11 నెలల చిన్నారి పాలిట యముడయ్యాడు. ఉద్యోగం లేదన్న కారణంతో తన సొంత బిడ్డను నర్మదా నదిలోకి విసిరేశాడు. ఆభం శుభం తెలియని చిన్నారిని చంపేశాడు. ఈ ఘటన జాలోర్ జిల్లా, సంచోర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిద్ధేశ్వర్ గ్రామంలో జరిగింది. తాను ఆత్మహత్య చేసుకోవాలని భావించి, చివరకు తన కన్న కొడుకుని చంపేశాడు.
వివరాల్లోకెళ్తే.. నలోధార్ గ్రామానికి చెందిన ముకేశ్ అనే వ్యక్తి బీహార్ లోని ముజఫర్పుర్కు చెందిన ఉష అనే యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వివాహనంతరం వీరిద్దరూ అహ్మదాబాద్లో కలిసి జీవనం సాగిస్తున్నారు. వీరికి 11 నెలల బాబు ఉన్నాడు. ముకేశ్ అహ్మదాబాద్ లోని ఓ ప్రముఖ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవాడు. కానీ, ఆకస్మాత్తుగా ఉన్న ఉద్యోగం పోయింది.
దీంతో ఏం చేయాలో తెలియని ముకేశ్ కొద్దిరోజుల పాటు భిక్షాటన చేస్తూ కాలం ఎల్లాదీశాడు. కానీ, ఉద్యోగం లేదన్న మనస్తాపంతో పలుమార్లు ఆత్మహత్య ప్రయత్నాలు చేశారు. కానీ, చివరి క్షణాల్లో తన భార్య, కుమారుడు గుర్తుకు వచ్చి.. విరమించుకున్నాడు. కానీ, కోరుకున్న జీవితాన్ని పోందలేక.. బతుకు భారమై.. మరో ప్రయత్నంగా తన కుమారుడితో సహా కంకారియా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుందామనుకున్నారు. కానీ, ఆ ప్రాంతంలో భారీ ఎత్తున జనం ఉండడం వల్ల ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమించుకున్నాడు.
ఈ క్రమంలో 11 నెలల చిన్నారిని తన తల్లితండ్రుల వద్ద వదిలివేయాలని ముకేశ్ తన భార్యను కోరగా.. ఆమె అందుకు అంగీకరించింది. తన తండ్రి ఇంట్లో వదిలి పెడతానని తీసుకువెళ్లిన చిన్నారిని ముకేశ్.. సిద్ధేశ్వర్ గ్రామంలోని నర్మదా నదిలోకి విసిరాడు. తన భార్యకు కూడా అబద్దం చెప్పాడు.
ఘటన జరిగిన తర్వాత సమీపంలో ఉన్నవారు చిన్నారిని చూడకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో నిందితుడిని క్షుణ్ణంగా విచారించగా .. తానే నదిలో విసిరేసినట్లు అంగీకరించాడు. దీంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు.
అనంతరం పోలీసులు కాలువలో చిన్నారి కోసం వెతకడం ప్రారంభించారు. ఘటనా స్థలానికి 20 కిలోమీటర్ల దూరంలోని ఓ గ్రామ సమీపంలో శుక్రవారం చిన్నారి మృతదేహాన్ని వెలికితీశారు . ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మున్సిపాలిటీ సహకారంతో పోలీసులు చిన్నారికి అంత్యక్రియలు నిర్వహించారు.