ప్ర‌మాద‌క‌ర స్థాయిలో య‌మునా ప్ర‌వాహం.. లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌ల త‌ర‌లింపు

Published : Sep 27, 2022, 04:52 PM IST
ప్ర‌మాద‌క‌ర స్థాయిలో య‌మునా ప్ర‌వాహం.. లోత‌ట్టు  ప్రాంతాల ప్ర‌జ‌ల త‌ర‌లింపు

సారాంశం

Yamuna river: దేశ రాజ‌ధాని ఢిల్లీలో యమునా న‌ది ప్ర‌మాద‌క‌ర స్థాయిలో ప్ర‌వ‌హిస్తోంది. అప్ర‌మ‌త్త‌మైన అధికారులు.. లోత‌ట్టు ప్రాంతాల నుంచి ప్ర‌జ‌ల‌ త‌ర‌లింపు చ‌ర్య‌ల‌ను చేప‌ట్టారు. మంగళవారం ఉదయం నీటి మట్టం 206 మీటర్ల మార్కును దాటడంతో తరలింపు హెచ్చరిక జారీ చేయబడింది.  

Delhi: ఎగువ పరీవాహక ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఈ ఏడాది ఇప్పటి వరకు య‌మునా న‌ది ప్ర‌వాహం 205.33 మీటర్ల ప్రమాద స్థాయిని అధిగమించింది. ఈ ఏడాదిలో ఎన్నడూ లేనంతగా 206.18 మీటర్లకు నీటి మట్టం పెరగడంతో ఢిల్లీలోని యమునా తీరానికి సమీపంలో లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను అధికారులు ఖాళీ చేయించడం ప్రారంభించారు. మంగళవారం ఉదయం నీటిమట్టం 206 మీటర్ల మార్కును దాటిన తర్వాత తరలింపు హెచ్చరిక జారీ చేసినట్లు తూర్పు ఢిల్లీ జిల్లా మేజిస్ట్రేట్ అనిల్ బంకా తెలిపారు. య‌మునా నదీ తీరాలకు సమీపంలో లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను ఖాళీ చేయించి ఎత్తైన సుర‌క్షిత‌ ప్రాంతాలకు తరలిస్తున్నారు. సమీప ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, నైట్ షెల్టర్లలో వారు బస చేయడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని ప్రజలను హెచ్చరించడానికి ప్రకటనలు చేస్తున్నట్లు బంకా తెలిపారు. ఢిల్లీలో నదికి సమీపంలో ఉన్న లోతట్టు ప్రాంతాలు వరదలకు గురయ్యే అవకాశం ఉంది. వాటిలో దాదాపు 37,000 మంది ప్రజలు నివసిస్తున్నారు. దీంతో ముంద‌స్తు జాగ్ర‌త‌ల‌ను తీసుకుంటున్న‌ట్టు అధికారులు తెలిపారు. వరదల కారణంగా య‌మునా నదీ ప్రవాహ ప్రాంతాల్లో నివసించే ప్రజలను అధికారులు ఖాళీ చేయించడం రెండు నెలల్లో ఇది రెండోసారి. యమునా నది ఆగస్ట్ 12న 205.33 మీటర్ల ప్రమాద స్థాయిని అధిగమించింది. దీని తర్వాత దాదాపు 7,000 మందిని నదీతీరానికి సమీపంలో ఉన్న లోతట్టు ప్రాంతాల నుండి సుర‌క్షిత ప్రాంతాల‌కు అధికారులు త‌ర‌లించారు. ఆగస్టు 13న నది తగ్గుముఖం పట్టకముందే నీటిమట్టం 205.99 మీటర్లకు చేరుకుంది.

ఇక మంగళవారం ఉదయం 5.45 గంటలకు పాత ఢిల్లీ రైల్వే బ్రిడ్జి వద్ద నీటి మట్టం 206 మీటర్ల తరలింపు స్థాయిని దాటిందని ఢిల్లీ వరద నియంత్రణ అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటల సమయానికి నది 206.18 మీటర్లకు ఉప్పొంగింది. మధ్యాహ్నం 3 నుంచి 5 గంటల మధ్య నీటిమట్టం 206.5 మీటర్లకు పెరగవచ్చని అంచనా వేసింది. హర్యానాలోని హత్నికుండ్ బ్యారేజీ నుంచి ఉదయం 7 గంటలకు దాదాపు 96,000 క్యూసెక్కుల నీటి విడుదలను అధికారులు నివేదించారు. సోమవారం ఉదయం 6 గంటలకు నీటి విడుదల‌ రేటు 2,95,212 క్యూసెక్కులు. ఈ ఏడాది ఇప్పటి వరకు ఇదే అత్యధికం. ఒక క్యూసెక్కు అంటే సెకనుకు 28.32 లీటర్లు.

సాధారణంగా హత్నికుండ్ బ్యారేజీ వద్ద 352 క్యూసెక్కుల ప్రవాహం ఉంటుంది. అయితే పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసిన తర్వాత నీటి విడుదల పెరుగుతుంది. బ్యారేజీ నుంచి విడుదలయ్యే నీరు దేశ రాజధానికి చేరుకోవడానికి సాధారణంగా రెండు నుంచి మూడు రోజులు పడుతుంది. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తర ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలను అతలాకుతలం చేస్తున్నాయి. సెప్టెంబరు 21 నుంచి ఢిల్లీలో నాలుగు రోజుల పాటు వర్షపాతం నమోదైంది. యమునా నదీ వ్యవస్థ పరీవాహక ప్రాంతం ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలను కవర్ చేస్తుంది. గత ఏడాది జూలై 30న యమునా నది ప్రమాద స్థాయిని అధిగమించడంతో పాత రైల్వే బ్రిడ్జి వద్ద నీటిమట్టం 205.59 మీటర్లకు పెరిగింది. 2019లో ఆగస్టు 18-19 తేదీల్లో ప్రవాహం రేటు 8.28 లక్షల క్యూసెక్కులకు చేరుకోగా, నదిలో నీటిమట్టం 206.60 మీటర్ల మార్కును తాకింది. 1978లో య‌మునా నది ఆల్‌టైమ్ రికార్డు స్థాయి 207.49 మీటర్ల నీటి స్థాయికి చేరుకుంది. 2013లో ఇది 207.32 మీటర్లకు పెరిగింది.

PREV
click me!

Recommended Stories

Delhi dust storm: ఢిల్లీలో ఇసుక తుఫాను బీభత్సం | Massive Sandstorm Hits Delhi-NCR | Asianet Telugu
Vijay vs Udhayanidhi: తమిళనాడు అసెంబ్లీలో రచ్చసీఎం విజయ్ vs ఉదయనిధి | Asianet News Telugu