
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఓ ఘరానా మోసం బయటకు వచ్చింది. మస్సాజ్ చేస్తానంటూ ఓ మహిళ ముందుగా వల వేస్తుంది. వారిని ఓ గదికి తీసుకెళ్లుతారు. అక్కడికి వెంటవెంటనే వారి గ్యాంగ్ సభ్యులు భిన్న వేషాల్లో కనిపించి బెదిరిస్తారు. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ అని, ఎస్సై అని, ఎన్జీవో సభ్యుడిని అంటూ రకరకాలుగా వచ్చి ఆ అమాయకుడిని హడలగొడతారు. తప్పుడు కేసులు పెట్టి నరకం చూపిస్తామని, వాటి నుంచి తప్పించుకోవాలంటే లక్షల డబ్బు ముట్టజెప్పాలని డిమాండ్ చేస్తారు. నంద్ కిశోర్ అనే బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు రంగంలోకి దూకి నలుగురు ముఠా సభ్యులను పట్టుకున్నారు. ఇందులో ఒక మహిళ కూడా ఉన్నది.
తాను ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తుండగా ఓ మహిళ నుంచి నెంబర్ రిసీవ్ చేసుకున్నానని, ఆమె తనను తాను మస్సాజ్ చేసే స్త్రీగా పరిచయం చేసుకుందని బాధితుడు నంద కిశోర్ తెలిపారు. ఆ తర్వాత వారు వాట్సాప్లోనూ టచ్లోకి వచ్చారు. జనవరి 29వ తేదీన ఆమె తనను సిగ్నేచర్ బ్రిడ్జీ వద్దకు రమ్మందని, అక్కడ ఆమె మరో మహిళను తన ఫ్రెండ్ అని పరిచయం చేసిందని వివరించారు. తనను ఆమె ఫ్రెండ్ ఇంటికి వెళ్లేలా కన్విన్స్ చేసిందని పేర్కొన్నారు.
ఆమె ఇంటికి చేరి.. ఓ గదిలోకి వెళ్లామని, వెంటనే తలుపు తట్టారని ఆయన తెలిపారు. డోర్ తీయగానే నలుగురైదుగురు నిలబడి ఉన్నారని, ఒక్కొక్కరు తమని తాము పరిచయం చేసుకుంటూ లోనికి వచ్చారని వివరించారు. ఒకరు తనది క్రైమ్ బ్రాంచ్ అని, మరొకరు ఇంటి యజమాని అని, ఇంకొకరు తాను ఎన్జీవో సభ్యుడినని, పోలీసు యూనిఫామ్ ధరించిన వేరొకరు తనను తాను ఢిల్లీ పోలీసు ఎస్సై అని పరిచయం చేసుకున్నాడని పేర్కొన్నారు.
Also Read: చేతిలోనే పేలిన నాటు బాంబు .. రెండు చేతులు పొగొట్టుకున్న గ్యాంగ్స్టర్
వారంతా కలిసి తనను రూ. 10 లక్షలు ఇవ్వాలని, లేదంటే సమస్యల్లో చిక్కుకుంటావ్ అని హెచ్చరించినట్టు నంద్ కిశోర్ తెలిపారు. తనను పోక్సో యాక్ట్ కింద తప్పుడు కేసు పెట్టి ఇరికిస్తానని పోలీసు యూనిఫామ్లో ఉన్న వ్యక్తి బెదిరించాడని, కానీ, తాను ఆ డబ్బు చెల్లించడానికి నిరాకరించానని నంద్ కిశోర్ వివరించారు. దీంతో పోలీసు యూనిఫామ్లో ఉన్న వ్యక్తి తనను హెడ్ క్వార్టర్స్కు తీసుకెళ్లుతానని బెదిరించాడని, వారు తన ఫోన్ తీసుకుని డేటా డిలీట్ చేసి బాదారని పేర్కొన్నారు.
క్రైమ్ బ్రాంచ్ అధికారి అని చెప్పుకున్న నిందితుడు తనను కారులోకి ఎక్కించాడని, చివరకు ఆ డబ్బులు ఇస్తానని చెప్పగానే కారు ఆపేశారని నంద్ కిశోర్ తెలిపారు. కారు ఆపగానే నంద్ కిశోర్ కారు నుంచి బయటకు దూకేసి అరిచాడని, దీంతో కొంతమంది వెంటనే గుమిగూడి పోలీసు యూనిఫామ్లో ఉన్న వ్యక్తిని పట్టుకుని నిజమైన పోలీసులకు సమాచారం చేరవేశారని వివరించారు. పోలీసులు నిందితులను పట్టుకుని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.