
న్యూఢిల్లీ: 2012లో దేశవ్యాప్తంగా ఉగ్రవాద దాడులకు పాల్పడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేసేందుకు నేరపూరిత కుట్ర పన్నినందుకు నలుగురు ఇండియన్ ముజాహిదీన్ కార్యకర్తలకు ఢిల్లీ కోర్టు బుధవారం 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ప్రత్యేక న్యాయమూర్తి శైలేందర్ మాలిక్.. డానిష్ అన్సారీ, అఫ్తాబ్ ఆలం, ఇమ్రాన్ ఖాన్, ఒబైద్-ఉర్-రెహ్మాన్లకు ఐపీసీలోని వివిధ సెక్షన్లు, యాంటీ టెర్రర్ చట్టం చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం కింద శిక్షను ఖరారు చేశారు. అయితే వారంతా ఇప్పటికే చాలా కాలం జైలులో ఉన్నందున వారి విడుదలకు ఈ తీర్పు మార్గం సుగమం చేసింది.
దోషులను 2013లో అరెస్టు చేశారని ఈ సందర్భంగా న్యాయమూర్తి గుర్తుచేశారు. ఇతర కేసులలో వారి కస్టడీ అవసరం లేకుంటే.. వారు ఇప్పటికే జైలులో ఉన్న కాలానికి పరిగణలోకి తీసుకుని శిక్ష కాలానికి అనుగుణంగా విడుదల చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దోషుల సామాజిక-ఆర్థిక నివేదికను కూడా న్యాయమూర్తి ప్రస్తావించారు. వారు సమాజంలోని అట్టడుగు వర్గాలకు చెందిన వారని చెప్పారు. అయితే దోషులుగా తేలిన నలుగురిపై ఢిల్లీ, హైదరాబాద్తో సహా పలు నగరాల్లో పేలుళ్లకు కుట్ర పన్నారనే ఆరోపణలు ఉన్నాయి.
ఇక, వీరిపై ఐపీసీ సెక్షన్లు 121A (భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి కుట్ర), 123 (యుద్ధం చేయడానికి రూపకల్పనను సులభతరం చేసే ఉద్దేశ్యంతో దాచడం) కింద 2012 సెప్టెంబర్లో ఎన్ఐఏ కేసు నమోదు చేసింది. అలాగే ఉగ్ర చట్టం చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టంలోని సెక్షన్లు 17 (ఉగ్రవాద చర్యకు నిధులు సేకరించడం), 18 (ఉగ్రవాద చర్యకు కుట్ర), 18A (ఉగ్రవాద శిబిరాలను నిర్వహించడం), 18B (ఉగ్రవాద చర్యకు వ్యక్తులను నియమించడం), 20 (ఉగ్రవాద సంస్థలో సభ్యులుగా ఉండటం) కింద అభియోగాలు మోపారు.