
న్యూఢిల్లీ: భారత సైన్యం కోసం రూ. 28,732 కోట్ల ఆయుధ కొనుగోలు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్వదేశీ మార్కెట్ల నుంచి ఈ కొనుగోళ్లు జరుపనుంది. తద్వార ఆత్మనిర్భర్ భారత్కు దన్ను ఇవ్వనున్నట్టు తెలుస్తున్నది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సారథ్యంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ మంగళవారం ఈ మేరకు ఆయుధ కొనుగోలు ప్రతిపాదనకు అంగీకారం తెలిపింది.
సాయుధ బలగాల యాక్సెప్టెన్స్ ఆఫ్ నెసెసిటీ ప్రపోజల్స్కు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ సమ్మతించింది. రూ. 28,732 కోట్ల విలువ చేసే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, కార్బైన్లు, డ్రోన్లు సహా పలు సామగ్రిని కొనుగోలు చేయనుంది.
ఎల్వోసీ గుండా పహారా కాస్తున్న మన ట్రూపులకు స్నైపర్ల నుంచి ముప్పు పొంచి ఉంటుందని, ఎదురెదురుగా బాహాబాహీ పోరులోనూ, కౌంటర్ టెర్రరిజం సమయాల్లోనూ జవాన్ల ప్రాణాలకు రక్షణగా ఇవి ఉపకరిస్తాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఈ సమయాల్లో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి బీఐఎష్ వీఐ లెవెల్ ప్రొటెక్షన్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కొనుగోలు చేస్తామని వివరించాయి.
యుద్ధ రీతులు, వ్యూహాలు మారుతున్నాయి. కాబట్టి, సుమారు నాలుగు లక్షల క్లోజ్ క్వార్టర్ బ్యాటిల్ కార్బైన్ల కొనుగోలుకూ డీఏసీ సమ్మతం తెలిపింది. అటనామస్ సర్వెలెన్స్, ఆర్మ్డ్ డ్రోన్లు కొనుగోలు చేయాలన్న ప్రతిపాదనకూ ఓకే చెప్పింది. అలాగే, కోల్కతా క్లాస్ షిప్లలో విద్యుత్ ఉత్పత్తి కోసం అప్గ్రేడెడ్ 1,250 కిలో వాట్ల మెరైన్ గ్యాస్ టర్బైన్ జెనరేటర్ల కొనుగోలుకు భారత నావికా దళం పెట్టిన ప్రతిపాదననూ డీఎంకే అంగీకారం తెలిపింది.
ఈ నిర్ణయాలు అన్నీ స్వదేశంలో తయారీ పరిశ్రమలకు దన్ను అందనుంది. ముఖ్యంగా చిన్న ఆర్మ్స్ మ్యానుఫాక్చరింగ్ ఇండస్ట్రీకి తోడ్పాటు అందించినట్టు అవుతుంది.