కాంగ్రెస్‌కు మరో షాక్.. కశ్మీర్‌లో ఆజాద్, హిమాచల్‌లో ఆనంద్ శర్మ తిరుగుబాటు.. పార్టీ పోస్టుకు రిజైన్

Published : Aug 21, 2022, 03:54 PM ISTUpdated : Aug 21, 2022, 03:58 PM IST
కాంగ్రెస్‌కు మరో షాక్.. కశ్మీర్‌లో ఆజాద్, హిమాచల్‌లో ఆనంద్ శర్మ తిరుగుబాటు.. పార్టీ పోస్టుకు రిజైన్

సారాంశం

కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేతలు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. మొన్నటికి మొన్న గులాం నబీ ఆజాద్ పార్టీ పదవికి రాజీనామా చేశారు. తాజాగా, కేంద్ర మాజీ మంత్రి ఆనంద్ శర్మ కూడా హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ యూనిట్‌లో ఓ పదవికి రాజీనామా చేశారు.  

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి సీనియర్లు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు. మరీ ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తున్న చోట ఈ ఝలక్‌లు ఎదురవడం కాంగ్రెస్‌కు మింగుడుపడటం లేదు. జమ్ము కశ్మీర్‌లో కాంగ్రెస్ పార్టీ పోస్టుకు గులాం నబీ ఆజాద్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. జమ్ము కశ్మీర్ కాంగ్రెస్ క్యాంపెయిన్ కమిటీ హెడ్‌గా ఆయనను నియమించిన గంటల వ్యవధిలోనే రిజైన్ చేసి సంచలనం సృష్టించారు. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ఇలాంటి ఎదురుదెబ్బే తగిలింది. హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ పోస్టుకు కేంద్ర మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత ఆనంద్ శర్మ రాజీనామా చేశారు. అంతేకాదు, ఆయన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఓ లేఖ రాసినట్టు తెలిసింది. తన ఆత్మాభిమానాన్ని ఎవరూ విలువ కట్టలేరని ఆ లేఖలో స్పష్టం చేసినట్టు సమాచారం. ఇటీవలి కాలంలో పార్టీ సమావేశాలకు, సంప్రదింపులకు తనను ఆహ్వానించలేదని, ఇది తనను బాధించిందని, పార్టీ నుంచి వెలివేసిన అనుభవాన్ని చవిచూశానని పేర్కొన్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

జమ్ము కశ్మీర్‌లో కాంగ్రెస్ పార్టీకి గులాం నబీ ఆజాద్ షాక్ ఇచ్చిన ఐదు రోజుల్లోనే తాజా పరిణామం వెలుగులోకి రావడం గమనార్హం. ఆగస్టు 16వ తేదీన ఆజాద్ పార్టీ పదవికి రాజీనామా చేశారు. అయితే, పార్టీ అభ్యర్థి కోసం రాష్ట్రంలో ప్రచారం చేస్తానని పేర్కొన్నారు. ఈ ఏడాదిలోనే హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్‌గా ఏప్రిల్ 26న ఆనంద్ శర్మను నియమించారు. కానీ, రాష్ట్రంలో పార్టీ తనకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. సంప్రదింపుల ప్రక్రియలో తనను పట్టించుకోలేదని ఆనంద్ శర్మ పేర్కొన్నట్టు సమాచారం.

ఆజాద్, ఆనంద్ శర్మ ఇద్దరు కూడా జీ 23 గ్రూపులో ఉన్నారు. పార్టీ నాయకత్వ నిర్ణయాలపై ఈ గ్రూపు అసహనంగా ఉన్నది. భూపిందర్ సింగ్ హుడా, మనీష్ తెవారీలు గల ఈ గ్రూపు.. పార్టీలో బ్లాక్ స్థాయి నుంచి సీడబ్ల్యూసీ వరకు అన్ని పోస్టులకు పారదర్శకంగా ఎన్నికలు జరగాలని డిమాండ్ చేస్తున్నది. హిమాచల్ ప్రదేశ్‌లో బీజేపీ నుంచి కాంగ్రెస్ అధికారాన్ని కైవసం చేసుకోలని ప్రయత్నాలు చేస్తునది. 

శర్మ 1982లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. 1984లో రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఆయనకు రాజ్యసభ టికెట్ ఇచ్చింది. అప్పటి నుంచి ఆయన రాజ్యసభ సభ్యుడిగానే కొనసాగుతున్నారు. పార్టీలోని కీలకమైన స్థానాలను అధిరోహించారు.

PREV
click me!

Recommended Stories

అరెస్ట్ అయిన కొన్ని గంటల్లోనే Udayanidhi Stalin విడుదల | Udhayanidhi Stalin Released Within Hours
Udhayanidhi Stalin Speech Controversy: తమిళ రాజకీయాల్లో డబుల్ మీనింగ్ డైలాగ్ ల రచ్చ | Asianet Telugu