చేసిన పనికి డబ్బులు అడిగినందుకు దళితుడిపై దాడి.. మెడలో చెప్పుల దండ వేసి మూత్రం తాగించిన దుండగులు

By Mahesh KFirst Published Nov 25, 2022, 7:58 PM IST
Highlights

రాజస్తాన్‌లో పని చేసి డబ్బులు అడిగినందుకు ఓ దళితుడిని  కొందరు దుండగులు తీవ్రంగా కొట్టారు. మెడలో షూలు వేసి మూత్రం తాగించారు. బాధితుడి ఫిర్యాదుతో ఘటన వెలుగులోకి వచ్చింది.
 

జైపూర్: ఓ దళితుడు తాను చేసిన పనికి డబ్బులు అడిగినందుకు తీవ్ర దాడికి గురయ్యాడు. అంతేకాదు, షూలతో మెడలో దండ వేసి మూత్రం తాగించారు. నిందితుల్లో ఒకడు ఈ దాడులను వీడియో రికార్డు చేశాడు. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ ఘటన రాజస్తాన్‌లోని సిరోహి జిల్లాలో చోటుచేసుకుంది.

38 ఏళ్ల భరత్ కుమార్ నిందితుల వద్ద ఎలక్ట్రికల్ వర్క్ చేశాడు. అందుకు రూ. 21,100ల బిల్లు చూపించాడు. ఈ బిల్లును తనకు చెల్లించాలని అడిగాడు. ఈ నేపథ్యంలో దాడి జరిగినట్టు పోలీసులు తెలిపారు. ‘బాధితుడు నవంబర్ 23న ముగ్గురిపై ఫిర్యాదు చేశాడు. భరత్ కుమార్ ఎలక్ట్రికల్ పని చేశాడు, రూ. 21,100 బిల్లు చెల్లించాలని వారిని కోరాడు. కానీ, అతనికి రూ. 5,000 మాత్రమే ఇచ్చారు. మిగతా డబ్బులు చెల్లించాలని నవంబర్ 19న భరత్ కుమార్ ఓ దాబా దగ్గరకు వెళ్లాడు. అందుకు సమాధానంగా రాత్రి 9 గంటలకు రావాలని భరత్ కుమార్‌కు చెప్పారు. భరత్ కుమార్ తిరిగి రాత్రి 9.10 గంటలకు వెళ్లాడు. అయినప్పటికీ అతన్ని వెయిట్ చేయిస్తూనే ఉన్నారు. కానీ, డబ్బులు ఇవ్వలేదు. అప్పుడు భరత్ కుమార్.. తన డబ్బులు తనకు చెల్లించాలని, లేదంటే పోలీసు కేసు పెడతానని బెదిరించాడు’ అని సిరోహి డీఎస్పీ దినేశ్ కుమార్ ఇండియా టుడేకు తెలిపారు.

Also Read: టాయిలెట్ సీటు దొంగలించాడని దళితుడికి గుండు కొట్టించి, ముఖంపై మసి పూసి, స్తంభానికి కట్టేసి దాడి.. ఎక్కడంటే ?

‘అప్పుడు నిందితుడు, ఇంకొందరు కలిసి భరత్ కుమార్‌ను పట్టుకుని తీవ్రంగా కొట్టారు. అతన్ని కొడుతున్నప్పుడే అతని మెడ చుట్టూ షూలు వేశారు. అందులో ఒకడు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశాడు. అతడిని వారు దాదాపు ఐదు గంటలపాటు దాడి చేశారు’ అని వివరించారు. బాధితుడితో బలవంతంగా మూత్రం తాగించారన్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్నామని పోలీసులు తెలిపారు. కేసులో దర్యాప్తు ప్రారంభించామని పేర్కొన్నారు.

click me!