ముంచుకొస్తున్న ‘అస‌ని’ తుఫాన్.. మార్చి 21న అండమాన్, నికోబార్ ను తాకే అవ‌కాశం..

Published : Mar 18, 2022, 09:56 AM IST
ముంచుకొస్తున్న ‘అస‌ని’ తుఫాన్.. మార్చి 21న అండమాన్, నికోబార్ ను తాకే అవ‌కాశం..

సారాంశం

ఆసని తుఫాన్ వేగంగా కదులుతోంది. ఇది ఈ నెల 21వ తేదీన అండమాన్, నికోబార్ తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఈ తుఫానుకు శ్రీలంక ‘అసని’ అని పేరు పెట్టింది. ఈ తుఫాను ప్రభావం వల్ల మార్చి 20, 21వ తేదీల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. 

ఈ ఏడాది తొలి తుఫాను (Cyclone) మార్చి 21 నాటికి బంగాళాఖాతంలో ఏర్పడుతుందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. అదేరోజు అండ‌మాన్, నికోబార్ ను తాకే అవ‌కాశం ఉంది. అండమాన్‌ను తాకిన తర్వాత బంగ్లాదేశ్, మయన్మార్ వైపు కదులుతుంది.

ఈ తుఫానుకు శ్రీలంక దేశం ‘అస‌ని’ (Asani) అని నామ‌క‌ర‌ణం చేసింది. దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య భాగాలపై ఏర్పడిన అల్పపీడనం తూర్పు-ఈశాన్య దిశగా కదిలి, మార్చి 17 గురువారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న తూర్పు భూమధ్యరేఖ హిందూ మహాసముద్రంపై కేంద్రీకృతమై ఉంది. ఇది తూర్పు-ఈశాన్య దిశగా కదులుతూ ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా మార్చి 19 శనివారం ఉదయం వరకు ఉంటుంది.

ఆ తర్వాత ఇది అండమాన్, నికోబార్ దీవుల వెంట దాదాపు ఉత్తరం వైపుగా కదులుతూ మార్చి 20 ఉదయం నాటికి అల్పపీడనంగా మారి మార్చి 21న తుఫానుగా పరిణామం చెందుతుంది. ఆ తర్వాత, ఇది దాదాపు ఉత్తర-ఈశాన్య దిశగా కదిలి మార్చి 22 ఉదయం బంగ్లాదేశ్-ఉత్తర మయన్మార్ తీరాలకు చేరుకునే అవకాశం ఉంది.

ప్రస్తుతం సముద్రం అల్లకల్లోలంగా ఉంది. అయితే నేటి నుంచి ఇది తీవ్రంగా మారే అవ‌కాశం ఉంది. ‘‘ ఈ అల్పపీడనం మరింత తూర్పు-ఈశాన్య ప్రాంతాలను కదిలిస్తుంది. శనివారం ఉదయం నాటికి అండమాన్ సముద్రాన్ని ఆనుకొని బాగా గుర్తించబడిన అల్పపీడన వ్యవస్థగా మారుతుంది. మార్చి 20, 21 తేదీల్లో అండమాన్, నికోబార్ దీవుల వెంబడి అల్పపీడన కదలిక మరింత తీవ్రమవుతుంది ” అని వాతావరణ శాఖ ఒక స్పెషల్ బులిటెన్ లో పేర్కొంది. 

తుఫాన్ బంగ్లాదేశ్, ఉత్తర మయన్మార్ వైపు వెళ్లే అవకాశం ఉన్నందున, దీని ప్రభావం ప్రధాన భూభాగంపై చూపదని వాతవారణ శాఖ తెలిపింది. ఈ తుఫాను ప్ర‌భావం వ‌ల్ల మార్చి 20, 21 తేదీలలో భారీ వర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని చెప్పింది. అయితే అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్నందున, మత్స్యకారులు మార్చి 17 నుంచి 22 మధ్య అండమాన్ సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించింది.
 

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu