23 ఏళ్ల వయసులో పోలీస్ అధికారిగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. 15 ఏళ్ల సర్వీసులో వివిధ పురస్కారాలు అందుకున్నారు. ఈ ఏడాది ‘‘కీర్తి చక్ర’’ పురస్కారాన్ని అందుకుంటున్న ఏకైక సీఆర్పీఎఫ్ అధికారి హర్షపాల్ సింగ్
దేశ రక్షణలో భాగంగా ధైర్య సాహసాలను ప్రదర్శించిన వీరులకు కేంద్ర ప్రభుత్వం విశిష్ట సేవా పురస్కరాలను ప్రకటించింది. వీరిలో ఒకరు హర్షపాల్ సింగ్. 23 ఏళ్ల వయసులో పోలీస్ అధికారిగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. 15 ఏళ్ల సర్వీసులో వివిధ పురస్కారాలు అందుకున్నారు.
ఈ ఏడాది ‘‘కీర్తి చక్ర’’ పురస్కారాన్ని అందుకుంటున్న ఏకైక సీఆర్పీఎఫ్ అధికారి హర్షపాల్ సింగ్. ఇంతకు ముందు 2008లో జార్ఖండ్లోని కుంతి జిల్లా చుందర్మండూలో జరిగిన ఎన్కౌంటర్లో ఐదుగురు మావోయిస్టు నేతలను హతమార్చినందుకు తొలిసారిగా పోలీస్ పతకం అందుకున్నారు.
2015లో కుంతి జిల్లాలో జరిగిన ఆపరేషన్లో ఆ జిల్లా జోనల్ మావోయిస్టు కమాండర్ను హర్షపాల్ బృందం మట్టుబెట్టింది. ఆయన పనితనానికి గాను ఆ ఏడాది మరోసారి రాష్ట్ర ప్రభుత్వం పోలీసు పతాకాన్ని ప్రదానం చేసింది.
2018 సెప్టెంబర్ 12న ఆయన ప్రాణాలను పణంగా పెట్టి మరీ కదనరంగంలోకి దూకారు. జమ్మూలోని ఝాజ్జర్-కోట్లీ ప్రాంతంలో జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు నక్కి ఉన్నారని సమాచారం అందుకున్న హర్షపాల్ టీమ్ ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది.
ఈ క్రమంలో ముష్కరులతో జరిగిన పోరులో ముగ్గురు ఉగ్రవాదులను అంతం చేసింది. ఈ ఘటనలో హర్షపాల్ గాయాలతో బయటపడ్డారు. ఇందుకు గాను కేంద్ర ప్రభుత్వం ‘‘కీర్తి చక్ర’’ అవార్డును ప్రకటించింది. ప్రస్తుతం హర్షపాల్ దంతెవాడలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ డిప్యూటీ కమాండెంట్గా పనిచేస్తున్నారు.