నెలాఖరు వరకు లాక్‌డౌన్ పొడిగింపు: యడియూరప్ప కీలక నిర్ణయం.. వాళ్లకు నో ఎంట్రీ

Siva Kodati |  
Published : May 18, 2020, 04:05 PM IST
నెలాఖరు వరకు లాక్‌డౌన్ పొడిగింపు: యడియూరప్ప కీలక నిర్ణయం.. వాళ్లకు నో ఎంట్రీ

సారాంశం

కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు లాక్‌డౌన్‌ను విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది

కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ నెలాఖరు వరకు లాక్‌డౌన్‌ను విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 31 వరకు నాలుగు రాష్ట్రాల నుంచి దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులను తమ రాష్ట్రంలోకి అనుమతించబోమని యడ్యూరప్ప సర్కార్ స్పష్టం చేసింది.

మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, కేరళ నుంచి తమ రాష్ట్రానికి ప్రయాణికుల రాకను నిరాకరిస్తామని తెలిపింది. ఇప్పటి వరకు కర్ణాటకలో 1,231 కేసులు నమోదు కాగా.. సుమారు 30 మంది ప్రాణాలు కోల్పోయారు.

Also Read:రక్తం కారుతోంది.. పాత చెప్పులు ఉంటే ఇవ్వండి సార్.. వలస కార్మికుడి వేడుకోలు

ఈ నేపథ్యంలో సోమవారం మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ... రెడ్‌ జోన్లు, కంటైన్‌మెంట్ జోన్లు మినహా మిగిలిన ప్రాంతాల్లో భౌతిక దూరం నిబంధనలు పాటిస్తూ రైళ్లు, బస్సు సర్వీసుల్ని పునరుద్దరించనున్నట్లు వెల్లడించారు.

బస్సుల్లో 30 మంది ప్రయాణికులను మాత్రమే అనుమతిస్తామని యడ్యూరప్ప వెల్లడించారు. అలాగే, ఓలా, ఉబేర్ క్యాబ్ సర్వీసులు కూడా రేపట్నుంచి అందుబాటులోకి రానున్నాయని ముఖ్యమంత్రి తెలిపారు.

రాష్ట్రాల మధ్య బస్సులు నడిపే విషయంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే సమన్వయం చేసుకోవాలని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో కర్ణాటక సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సంగతి తెలిసిందే.

Also Read:రాష్ట్రపతి భవన్ లో పోలీస్ అధికారికి కరోనా: పలువురు క్వారంటైన్ కు

అయితే ఆదివారాల్లో మాత్రం కర్ణాటకలో పూర్తి స్థాయి లాక్‌డౌన్‌ అమలు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం అశ్వత్థ నారాయణ్ చెప్పారు. ఆ రోజు మాత్రం కేవలం నిత్యావసరాలు అందుబాటులో ఉంటాయన్నారు.

రేపటి నుంచి పార్కులు తెరుచుకుంటాయని పేర్కొన్న ఆయన.. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను పాటిస్తామని చెప్పారు. కంటైన్మెంట్ జోన్లు మినహా మిగిలిన చోట్ల దుకాణాలన్నీ తెరుచుకుంటాయని తెలిపారు. మాల్స్, విద్యా సంస్థలు, సినిమా థియేటర్లు, స్విమ్మింగ్ పూల్స్ మాత్రం మూసే ఉంటాయని ఆయన పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

ఇండియాలో ఏ ఆవు ఎక్కువ పాలు ఇస్తుంది..? రోజుకు ఎన్ని లీటర్లో తెలుసా?
Narendra Modi Plays Football with Youth in Gangtok Visit | Foot Ball Playing | Asianet News Telugu