
Coromandel Express: ఒడిశా రైలు దుర్ఘటన యావత్ దేశాన్ని కుదిపేసింది. ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. సహాయ చర్యలు జరుగుతోన్న కొద్దీ క్షత్రగాత్రులు బయటపడుతున్నారు. మరో వైపు మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటివరకూ 288 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 56 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.
ఈ ప్రమాదం పరిస్థితులను పరిశీలిస్తే.. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశమున్నట్టు అధికారులు భావిస్తున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడంతో ఈ ప్రమాదం భారతదేశంలో జరిగిన అత్యంత ఘోర ప్రమాదాలలో ఒకటిగా నిలిచింది. ఈ ప్రమాదంలో రెండు ప్యాసింజర్ రైళ్లు, 12841 షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్ప్రెస్, 12864 బెంగళూరు-హౌరా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఉన్నాయి.
అయితే.. ప్రమాద బారిన పడిన కోరమాండల్ ఎక్స్ప్రెస్ చరిత్ర గమనిస్తే.. గడిచిన 21 ఏళ్లలో ఈ రైలు నాలుగు ప్రమాదానికి గురైంది.
కోరమాండల్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదానికి గురైన సందర్భాలు:
డిసెంబర్ 6, 2011: హౌరా-చెన్నై కోరమాండల్ ఎక్స్ప్రెస్ ఆంధ్ర ప్రదేశ్లోని నెల్లూరు సమీపంలో పట్టాలు తప్పడంతో 32 మంది ప్రయాణికులు మరణించారు. పలువురు గాయపడ్డారు.
ఫిబ్రవరి 13, 2009: హౌరా-చెన్నై కోరమాండల్ ఎక్స్ప్రెస్ జాజ్పూర్ కియోంజర్ రోడ్ సమీపంలో పట్టాలు తప్పింది. ఫలితంగా 16 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. ప్రమాదానికి గల కారణాలు నేటికీ తెలియరాలేదు.
మార్చి 15, 2002: హౌరా-చెన్నై కోరమాండల్ ఎక్స్ప్రెస్ తమిళనాడులోని నెల్లూరు జిల్లాలోని పడుగుపాడు రోడ్డు ఓవర్బ్రిడ్జి వద్ద పట్టాలు తప్పింది.
జూన్ 2, 2023: బహనాగ బజార్ స్టేషన్లో ఆగి ఉన్న గూడ్స్ రైలును కోరమాండల్ ఎక్స్ప్రెస్ ఢీ కొట్టింది. దీంతో 21 కోచ్లు పట్టాలు తప్పాయి. మూడు కోచ్లు పక్కనే ఉన్న ట్రాక్పై పడ్డాయి. ఆ సమయంలో అటుగా వస్తున్న 12864 బెంగళూరు-హౌరా ఎక్స్ప్రెస్ వాటిని ఢీ కొట్టింది. ఇలా మూడు రైలు ప్రమాదం గురికావడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఇప్పటి వరకూ 288 మంది ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 1000 మంది గాయపడ్డారు.