కేరళలో పినరయి విజయన్ సర్కార్పై కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు రెడీ అయ్యింది. ఈ నెల 24న అసెంబ్లీ సమావేశాల్లో తమ పార్టీ అవిశ్వాస తీర్మానం పెడుతుందని విపక్షనేత రమేశ్ చెన్నితల శుక్రవారం తెలిపారు
కేరళలో పినరయి విజయన్ సర్కార్పై కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు రెడీ అయ్యింది. ఈ నెల 24న అసెంబ్లీ సమావేశాల్లో తమ పార్టీ అవిశ్వాస తీర్మానం పెడుతుందని విపక్షనేత రమేశ్ చెన్నితల శుక్రవారం తెలిపారు.
అవినీతి ఆరోపణలు వెల్లువెత్తిన క్రమంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ పదవి నుంచి వైదొలగాలని ఆయన డిమాండ్ చేశారు. కోవిడ్ 19 పేరుతో జరిగిన అవినీతికి బాధ్యత వహిస్తూ తాము కేరళ సీఎం రాజీనామాకు డిమాండ్ చేస్తున్నామని రమేశ్ చెప్పారు.
కాగా, కేరళలో ఇటీవల వెలుగు చూసిన గోల్డ్ స్మగ్లింగ్ కేసులోనూ పినరయి విజయన్ సర్కార్పై విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఇక కోవిడ్ 19 రోగులు, క్వారంటైన్లో ఉన్న వ్యక్తుల కాల్ వివరాలను సేకరించరాదని పోలీసులను ఆదేశించాలంటూ రమేశ్ కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దానిని న్యాయస్థానం తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. కాంటాక్ట్ ట్రేసింగ్ కోసమే కోవిడ్ 19 రోగుల టవర్ లోకేషన్ వివరాలను తాము వాడుతున్నామన్న ప్రభుత్వ వాదనతో హైకోర్టు ఏకీభవించింది.
మరోవైపు కేరళ బంగారం స్మగ్లింగ్ కేసులో హైదరాబాద్ లింకులపై దర్యాప్తు సంస్థల నిఘా కొనసాగుతోంది. స్మగ్లింగ్ ముఠా పలు విడతలుగా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ద్వారా గతంలో బంగారాన్ని అక్రమంగా దిగుమతి చేసిందని విచారణలో తేలింది.
హైదరాబాద్, బెంగళూరు విమానాశ్రయాల ద్వారా 2018 ప్రాంతంలో బంగారాన్ని తీసుకొచ్చారనే కోణంలో తాజా దర్యాప్తును కొనసాగిస్తున్నట్లుగా సమాచారం.