
ముంబయి: కాంగ్రెస్ నేత ఆల్కా లాంబా, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మధ్య ట్వీట్ల యుద్ధం నడించింది. ఓ ఇంటర్వ్యూలో శరద్ పవార్ విపక్షాల వైఖరికి కొంత దూరం జరిగినట్టుగా కామెంట్ చేశారు. అదానీ గ్రూప్పై కొన్ని సంస్థలు టార్గెట్ చేసుకుని దాడి చేస్తున్నాయని అన్నారు. హిండెన్బర్గ్ రిపోర్టు వెల్లడించిన విషయాలపైనా జేపీసీ వేసి విచారించాలనే డిమాండ్తో తాను ఏకీభవించడం లేదని అన్నారు.
కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్షాలు అదానీపై విచారణకు డిమాండ్ చేస్తున్నాయి. కానీ, నిన్న మాత్రం శరద్ పవార్ అందుకు భిన్నమైన వాదన తెరమీదకు తేవడంతో అందరూ నోరెళ్లబెట్టారు. తాజాగా, కాంగ్రెస్ నేత ఆల్కా లాంబా ఆయనపై అటాక్ చేసింది. శరద్ పవార్, గౌతమ్ అదానీ ఇద్దరూ పక్క పక్కనే కూర్చుని ఏదో మాట్లాడుకుంటున్న కనిపించిన ఫొటోను ఆమె ట్వీట్ చేశారు. ఆ ఫొటోకు ఘాటైన క్యాప్షన్ పెట్టారు.
భయపడ్డారా? కొందరు స్వార్థపరులు తమ ప్రయోజనాల కోసం నియంత పాలననూ ప్రశంసిస్తారు. ఈ దేశ ప్రజల పోరాటాన్ని రాహుల్ గాంధీ ఒక్కడే పోరాడుతున్నాడని పేర్కొంది. వాటితోపాటు అవినీతిపరులైన వ్యాపారవేత్త, వారిని కాపాడుతున్న ఓ చౌకీదార్ పై రాహుల్ ఒంటరి పోరు చేస్తున్నారని అన్నారు.
కాగా, దేవేంద్ర ఫడ్నవీస్ శరద్ పవార్కు మద్దతుగా కామెంట్ చేశారు. రాజకీయాలు వస్తుంటాయి పోతుంటాయని అన్నారు. 35 ఏళ్ల చిరకాల మిత్రపక్ష పార్టీకి సీనియర్ రాజకీయ నేత, నాలుగు సార్లు మహారాష్ట్రకు సీఎంగా చేసిన ఆ వ్యక్తిపై ఈ వ్యాఖ్యలు దిగ్భ్రాంతికరంగా ఉన్నాయని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ రాజకీయ సంస్కృతిని భ్రష్టుపట్టిస్తున్నారని ఆరోపించారు.