
కర్ణాటకలో ఓ విచిత్ర ఘటన జరిగింది. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కర్ణాటకలోని ఉడిపిలో గురువారం పీక్ అవర్ లో జరిగిన ఈ ఘటన హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ విషయం ఏంటంటే... ఎక్కడినుంచి వచ్చిందో ఓ పాము రోడ్డు మీదికి.. అదీ బీజీ ఏరియాలోకి వచ్చింది.
ఎవ్వరూ చూడకపోతే పాపం ఏ వాహనం కిందనో పడి అది చనిపోయేంత పరిస్థితి. అయితే దాన్ని అక్కడి ట్రాఫిక్ కానిస్టేబుల్ గమనించాడు. వెంటనే ట్రాఫిక్ ను ఆపేశాడు. అది తన దారి వెతుక్కుని రోడ్డు దాటి వెళ్లేవరకు అరగంటపాటు ఎక్కడి వాహనాలు అక్కడే బారులు తీరి ఆగిపోయాయి.
ఇవేమీ తెలియని పాము మాత్రం బిందాస్ గా రోడ్డు దాటి వెళ్లిపోయింది. చాలామంది ఈ ఘటనను ఫొటోలు, వీడియోలు తీశారు. ఇది విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఉండే కల్సంకా జంక్షన్ లో జరిగిందంటూ ఓ నెటిజన్ ట్విట్టర్ లో వీడియో షేర్ చేశాడు. ఇంకేం వెంటనే ఈ వీడియోను 25వేలమంది చూశారు. చాలామంది షాకింగ్ అంటూ కామెంట్స్ పెట్టారు.
మొత్తానికి జంతు ప్రేమ చూపించిన ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ ను అభినందించాల్సిందే. ఫీక్ ట్రాఫిక్ టైంలో అలాంటి నిర్ణయం తీసుకోవడం కాస్త సాహసోపేతమయిందే. అయినా ధైర్యంగా వ్యవహరించాడా కానిస్టేబుల్.
ఆ పామును ఆ తరువాత రక్షించి, దానికైన గాయాలకు చికిత్స చేయించారని పోలీస్ అధికారులు తెలిపారు. ట్రాఫిక్ ను అరగంట పాటు ఆపడం తప్ప పాము మరే ఇబ్బందులూ పెట్టులేదని కూడా వారు తెలిపారు.