దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి స్పెషల్ ... సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆసక్తికర కామెంట్స్

By Arun Kumar PFirst Published Sep 24, 2024, 11:49 PM IST
Highlights

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మంగళవారం బారాబంకిలోని విజయ్ పార్క్‌లో పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ విగ్రహాన్ని ఆవిష్కరించారు.  

బారాబంకి : పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయను అంత్యోదయ సిద్ధాంతకర్తగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అభివర్ణించారు. ప్రతి చేతికి పని, ప్రతి పొలానికి నీరు అనే నినాదాన్ని దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఇచ్చారని యోగి గుర్తు చేశారు. స్వతంత్ర భారత దేశ దశ దిశ ఏవిధంగా ఉండాలనే దానిపై అప్పటి అధికారంలో ఉన్నవారికి కొంత గందరగోళం ఉండేది...కానీ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మాత్రం క్లారిటిగా ఉన్నారని సీఎం యోగి పేర్కొన్నారు.

భారత రాజకీయాల్లో దీన్ దయాళ్ ఉపాధ్యాయ కొత్త ఒరవడిని సృష్టించారని యోగి గుర్తుచేసారు. స్వాతంత్య్రం వచ్చిన వెంటనే మొదట రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్... ఆ తర్వాత భారతీయ జనసంఘ్ ద్వారా రాజకీయా రంగ ప్రవేశం చేసిన దీన్ దయాళ్ ఉపాధ్యాయ దేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను మార్చేసారని అన్నారు. ఆయన అందించిన ఆలోచనలు నేడు భారతదేశానికే కాకుండా ప్రపంచ సమాజానికి కూడా మార్గనిర్దేశం చేసాయని యూపీ సీఎం పేర్కొన్నారు.

Latest Videos

పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఇవాళ (మంగళవారం) బారాబంకిలోని విజయ్ పార్క్‌లో ఆయన విగ్రహాన్ని సీఎం యోగి ఆవిష్కరించారు. అలాగే   దీనదయాళ్ జీవితంపై ఏర్పాటు చేసిన ప్రదర్శనను కూడా ఆయన ప్రారంభించారు. ఈ ప్రదర్శనను సీఎం కూడా పరిశీలించారు.

సమాజంలో అట్టడుగున ఉన్న వ్యక్తితోనే ప్రగతి ప్రమాణం ఉండాలి

అంత్యోదయ గురించి సీఎం యోగి మాట్లాడుతూ... ఆర్థిక పురోగతి, అభివృద్ధి ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తికి కాదు సమాజంలో అట్టడుగున ఉన్న వ్యక్తికి అవసరమని పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ చెప్పారని సీఎం యోగి అన్నారు. బిజెపి అయినా, ఇతర రాజకీయ పార్టీల అయినా వారి ఎజెండాలో గ్రామీణ ప్రాంతాలు, పేదలు, రైతులు, మహిళలు భాగమయ్యారని... ఎలాంటి వివక్షత లేకుండా ప్రభుత్వ పథకాలు అన్ని వర్గాల ప్రజలను చేరుతున్నాయంటే దీనికి ప్రధాన కారకుడు పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ అని సీఎం యోగి అన్నారు.

దీనదయాళ్ ఉపాధ్యాయ కలలను సాకారం చేస్తున్న ఎన్డీయే ప్రభుత్వం

పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ఏడు దశాబ్దాల క్రితం చూసిన కలలను సాకారం చేయడానికి ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో కృషి చేస్తుందని సీఎం యోగి అన్నారు. నేడు దేశంలో కరోనా వంటి మహమ్మారి సమయంలో 80 కోట్ల మందికి నిరంతరం ఉచిత రేషన్ సౌకర్యం లభిస్తోందని,... 12 కోట్ల మరుగుదొడ్లు నిర్మించారని, ఆయుష్మాన్ కార్డు ద్వారా ఐదు లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పిస్తున్నారు... ప్రధాని మోడీ నాయకత్వంలో అవిశ్రాంతంగా అభివృద్ధి పథంలో దేశం దూసుకుపోతోందని యోగి అన్నారు.

రాష్ట్ర రాజధాని ప్రాంతంలో ముఖ్యమైన జిల్లాగా బారాబంకి

బారాబంకి రాష్ట్ర రాజధాని ప్రాంతంలో ఒక ముఖ్యమైన జిల్లాగా అవతరించిందని సీఎం యోగి అన్నారు. బారాబంకి కూడా లక్నోతో సమానంగా అభివృద్ధిలో భాగస్వామి కాబోతోందని, ఈ ప్రాంతంలో భాగమైన తర్వాత మౌలిక సదుపాయాలు, ప్రజా రవాణా వంటి అత్యాధునిక సౌకర్యాలు బారాబంకి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయని అన్నారు.

బారాబంకిని అభివృద్ధి నుండి ఎవరూ దూరం చేయలేరు

ఒకవైపు లక్నో, మరోవైపు అయోధ్య ఉండటం బారాబంకి అదృష్టమని సీఎం యోగి అన్నారు. ఈ రెండు ప్రాంతాల్లో జరిగే అభివృద్ధి వల్ల కలిగే ప్రయోజనాలను బారాబంకి కోల్పోదని, లాధేశ్వర్ నాథ్ మహాదేవ్ ఆలయానికి కొత్త గుర్తింపు తీసుకురావడానికి ధార్మిక దాతృత్వ, సాంస్కృతిక-పర్యాటక శాఖ నిరంతరం కృషి చేస్తుందని, కాశీ విశ్వనాథ్ ధామ్, అయోధ్య ధామ్ తరహాలోనే మహాదేవ్ ఆలయానికి కూడా అద్భుతమైన కారిడార్‌ను నిర్మించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని అన్నారు.

కెడి సింగ్ బాబు స్మారక చిహ్నాన్ని నిర్మించేందుకు సన్నాహాలు

తన కాలంలో భారత హాకీకి ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకువచ్చిన బారాబంకికి చెందిన కెడి సింగ్ బాబు జ్ఞాపకాలను పదిలం చేసేందుకు ఆయన పూర్వీకుల ఇంటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని సీఎం యోగి అన్నారు. ఇక్కడ కెడి సింగ్ బాబు, భారత హాకీకి ఒక గొప్ప స్మారక చిహ్నాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని, హాకీకి సంబంధించిన ప్రదర్శనలు,  కార్యక్రమాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.

రామ్‌సనేహి ఘాట్ సమీపంలో పారిశ్రామిక కారిడార్

రామ్‌సనేహి ఘాట్ సమీపంలో ఒక పారిశ్రామిక కారిడార్‌ను నిర్మించబోతున్నామని సీఎం యోగి అన్నారు. దీని ద్వారా బారాబంకిలో వేలాది మంది యువతకు ఉద్యోగాలు లభిస్తాయని, పారిశ్రామికంగా, విద్యాపరంగా బారాబంకి మంచి పురోగతి సాధిస్తోందని అన్నారు. పద్మ అవార్డు గ్రహీత రామ్‌శరణ్ వర్మ ఒక ప్రగతిశీల రైతుగా ప్రత్యేక గుర్తింపు పొందారని అన్నారు.

క్రీడలకు కొత్త రాజధానిగా బారాబంకి

జిల్లాలో రోడ్ల మరమ్మతుల కోసం ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికతో పనులు ప్రారంభించిందని సీఎం యోగి అన్నారు. ఒకవైపు రాష్ట్ర రాజధాని ప్రాంతంగా మంచి మౌలిక సదుపాయాలు బారాబంకికి అందుబాటులోకి వస్తున్నాయని... మరోవైపు కెడి సింగ్ బాబు పేరు మీద క్రీడలకు కొత్త రాజధానిగా బారాబంకి అవతరించనుందని...ఇంకోవైపు లాధేశ్వర్ నాథ్ ఆలయం కారణంగా అద్భుతమైన కారిడార్ ఏర్పాటు కావడం వల్ల బారాబంకి మతపరమైన పర్యాటక ప్రాంతంగా కూడా ప్రసిద్ధి చెందుతుందని అన్నారు.

ముఖ్యమంత్రి యువ స్వయం ఉపాధి పథకంతో పది లక్షల మంది యువత

ప్రతి పేద కుటుంబానికి గృహాలు, మరుగుదొడ్లు, రేషన్ కార్డులు, పింఛన్లు వంటి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందుతున్నాయని సీఎం యోగి అన్నారు. రాబోయే రోజుల్లో పది లక్షల మంది యువతను ముఖ్యమంత్రి యువ స్వయం ఉపాధి పథకంతో అనుసంధానం చేయబోతున్నామని... స్వయం ఉపాధి కోసం రుణం తీసుకునే యువతకు ఐదు లక్షల రూపాయల వరకు ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తుందని... ఇలా పది లక్షల మంది యువత లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించగలుగుతారని అన్నారు.

డబుల్ ఇంజిన్ ప్రభుత్వం డబుల్ స్పీడ్ అభివృద్ధి, భద్రతలో కొత్త నమూనాను అందిస్తూ ఉత్తరప్రదేశ్‌ను ముందుకు తీసుకువెళుతోందని యోగి అన్నారు. దీనదయాళ్ ఉపాధ్యాయ కలల భారతదేశంతో పాటు ఉత్తరప్రదేశ్‌ను నిర్మించడంతో పాటు, ఆయన చూపిన మార్గంలో నడుస్తూ ప్రభుత్వం ఎలాంటి వివక్షత లేకుండా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తోందని సీఎం యోగి విశ్వాసం వ్యక్తం చేశారు.

 

 

click me!