
బెంగళూరు: కర్ణాటక (Karnataka)లో హిజబ్ వివాదం (Hijab Row) కలకలం రేపుతున్నది. తరగతి గదుల్లో హిజబ్ ధరించడాన్ని కొందరు నిరసిస్తున్నారు. ఆ నిరసనకారులు కాషాయ వర్ణపు చున్నీలను మెడ చుట్టూ వేసుకుంటున్నారు. ఈ వివాదం ఇప్పుడు హైకోర్టుకు చేరింది. ఈ వివాదంపై కర్ణాటక బయట కూడా చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై (CM Basavaraj Bommai) స్పందించారు. భారత రాజ్యాంగాన్ని (Indian Constitution) ఉటంకిస్తూ తమ ప్రభుత్వ వైఖరిని సమర్థించుకున్నారు.
స్కూల్స్, కాలేజీల్లో పాటించాల్సిన ఏకరీతి విధానాలపై రాజ్యాంగం స్పష్టంగా పేర్కొన్నదని సీఎం బసవరాజ్ బొమ్మై అన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో పాటించాల్సిన యూనిఫార్మిటీ గురించి రాజ్యాంగంలో ప్రత్యేక రూల్స్ ఉన్నాయని వివరించారు. ఎడ్యుకేషన్ యాక్ట్లో వీటిని స్పష్టంగా పేర్కొన్నారని తెలిపారు. విద్యా సంస్థల్లో అవలంబించాల్సిన విధానాలను ఈ చట్టాలు స్పష్టంగా వెల్లడిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ విషయమై తాము ఓ నోటిఫికేషన్ జారీ చేశామని చెప్పారు.
అదే సందర్భంలో ఆయన ఈ విషయంపై తాను ఎక్కువ మాట్లాడలేనని అన్నారు. ఎందుకంటే ఈ వివాదం హైకోర్టుకు చేరిందని తెలిపారు. ఇప్పటికి అయితే.. యూనిఫామ్స్ గురించి తాము ఒక సర్క్యూలర్ విడుదల చేశామని చెప్పారు. ఈ వివాదంపై హైకోర్టు తీర్పు వెలువరించే వరకు తమ సర్క్యూలర్లోని నిబంధనలు అమలు చేయాలని వివరించారు. పరీక్షలు దగ్గరకు వస్తున్నాయని, విద్యార్థులు అందరూ ఈ సర్క్యూలర్ పాటించాలని, ప్రశాంత వాతావరణాన్ని మెయింటెయిన్ చేయాలని సూచనలు చేశారు.
కాగా, సోమవారం ఉదయం ఉడుపి జిల్లాలోని కోటేశ్వర పట్టణంలో మరో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. కాలవర వరదరాజ్ ప్రభుత్వ కాలేజీకి సోమవారం ఉదయం ముగ్గురు విద్యార్థులు హిజబ్ ధరించి వచ్చారు. ఇది చూడగానే.. ఇతర విద్యార్థులు కొందరు కాషాయ వర్ణపు వస్త్రాలను కప్పుకోవడం ప్రారంభించి నిరసనలు చేశారు.
ఈ ఘటనలపై ఆదివారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బీసీ నగేశ్ స్పందించారు. అయితే, స్కూల్ యూనిఫామ్స్ ధరించడానికి ఇష్టపడని వారు వేరే మార్గాలను అన్వేషించవచ్చునని వివరించారు. మిలిటరీలో పాటించే నిబంధనలనే విద్యా సంస్థల్లోనూ అమలు చేయాలని పేర్కొన్నారు.
కర్ణాటకలోని విద్యాసంస్థల్లో హిజాబ్పై వివాదాలు పెరుగుతున్న నేపథ్యంలో సోమవారం ఉడిపి జిల్లాలోని కుందాపూర్ ప్రభుత్వ కళాశాలలో బాలికలు హిజాబ్ ధరించి క్యాంపస్లోకి ప్రవేశించేందుకు అనుమతించారు. ఈ విషయమై కళాశాల యాజమాన్యాన్ని ప్రశ్నించగా.. కళాశాల గేట్ల వెలుపల రద్దీని నివారించేందుకు ఇలా చేశామని కళాశాల అధికారులు తెలిపారు. విద్యాసంస్థల్లో తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు ‘యూనిఫాం’ తప్పనిసరని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు హిజాబ్ను తొలగించిన తర్వాతే విద్యార్థులు తరగతులకు హాజరు కావాలని ప్రిన్సిపాల్ రామకృష్ణ పునరుద్ఘాటించారు. మరోవైపు.. తరగతుల్లో హిజాబ్ తొలగించబోమని విద్యార్థులు గట్టి పట్టుమీద ఉన్నారు.
అలాగే.. కుందాపూర్లోని కలవర వరదరాజ్ ఎం శెట్టి ప్రభుత్వ కళాశాలలో హిజాబ్ ధరించిన విద్యార్థులను ఇంటికి పంపించారు. ఈ విషయంపై ఆ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. "మేము విద్యార్థులను ఇంటికి తిరిగి పంపించాము. ప్రభుత్వ ఆదేశాల మేరకు హిజాబ్ లేకుండా తరగతులకు వెళ్లమని సూచించాం. కానీ వారు నిరాకరించారు. కాబట్టి మేము వారిని కళాశాలలోకి అనుమతించలేదు. ఈ వివాదంపై రేపు హైకోర్టు నుంచి ఎలాంటి ఉత్తర్వులు వస్తాయో వేచి ఉన్నాం.. " అని వైస్ ప్రిన్సిపాల్ ఉషాదేవి చెప్పారు.