23 వేలు దాటిన కేసులు: లాక్ డౌన్ ఉల్లంఘనలపై తెలంగాణకు కేంద్ర బృందం

By telugu teamFirst Published Apr 24, 2020, 4:58 PM IST
Highlights

భారతదేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 23 వేలు దాటింది. తాజాగా తెలంగాణ, గుజరాత్, తమిళనాడులకు కేంద్ర బృందాలను పంపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

న్యూఢిల్లీ: లాక్ డౌన్ ఉల్లంఘనలు జరుగుతున్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తనిఖీలకు గుజరాత్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు కూడా కేంద్రం తన బృందాలను పంపనుంది. గుజరాత్ లోని అహ్మదాబాద్, సూరత్ వంటి హాట్ స్పాట్స్ కొత్తగా కనిపిస్తుండడాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోంది. మహారాష్ట్రలోని థానే, తెలంగాణలోని హైదరాబాద్, తమిళనాడులోని చెన్నైలను కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోంది. 

సాధారణ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర బృందాలు పరిస్థితిని పరిశీలించి రాష్ట్ర యంత్రాంగాలకు తగిన సలహాలు ఇవ్వడమే కాకుండా కేంద్రానికి నివేదికలను కూడా సమర్పిస్తాయి.  ఈ కేంద్ర బృందాలు లాక్ డౌన్ చర్యల అమలును, నిత్యావసర సరుకుల పంపిణీని, సామాజిక దూరం పాటింపు, ఆరోగ్య మౌలిక సదుపాయాలు, భద్రత, ఆరోగ్య నిపుణుల అందుబాటు వంటి విషయాలను, కార్మికులకూ పేదలకూ ఏర్పాటు చేసిన రిలీఫ్ క్యాంపుల పరిస్థితిని కేంద్ర బృందాలు పరిశీలిస్తాయి. 

బెంగాల్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్రలకు ఇప్పటికే కేంద్ర బృందాలను ప్రభుత్వం పంపించింది. కరోనా వైరస్ పై రాజకీయాలు చేస్తున్నారంటూ కేంద్ర బృందం రాకపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇదిలావుంటే, భారతదేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 23 వేల సంఖ్యను దాటింది. ఇందులో 17,610 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 4,748 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశంలో 718 మంది మృత్యువాత పడ్డారు. 

గత 28 రోజులుగా 15 జిల్లాలో కొత్తగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. గత 24 గంటల్లో కొత్తగా 1,684 కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 23,077కు చేరుకుంది. 

click me!