
New Advertising Rules: మోసపూరిత, తప్పుదారి పట్టించే ప్రకటనలను కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టింది. ఈమేరకు నూతన మార్గదర్శకాలను జారీ చేస్తూ.. డిస్కౌంట్లు, ఉచిత క్లెయిమ్లను అందజేస్తూ వినియోగదారులను ఆకర్షించే ప్రకటనలపై కఠినమైన నిబంధనలను విధించింది. ప్రధానంగా పిల్లలను లక్ష్యంగా చేసుకుని.. తప్పుదోవ పట్టించే ప్రకటనలను నియంత్రించడానికి కేంద్రం ప్రయత్నించింది.
ఈ మేరకు ప్రకటనలపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రకటనలను ప్రసారం చేసే ముందు తగు జాగ్రత్తలు తీసుకోవాలని యాడ్ ఏజెన్సీలకు పేర్కొంది. ఈ క్రమంలో సరోగేట్ ప్రకటనలపై కూడా నిషేధించింది. యాడ్స్ పారదర్శకంగా ఉండాలని పేర్కొంది. కేంద్రం జారీ చేసిన ఈ మార్గదర్శకాలు తక్షణం అమల్లోకి వచ్చాయని తెలిపింది. అలాగే.. ప్రింట్, టెలివిజన్, ఆన్లైన్ ప్రకటనలకు నియమాలు వర్తిస్తాయి. అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ASCI) జారీ చేసిన స్వీయ నియంత్రణ ప్రకటనల మార్గదర్శకాలు కూడా అమలులో ఉంటాయి
ఈ సందర్భంగా వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. వినియోగదారులు ప్రకటనలపై చాలా ఆసక్తిని కనబరుస్తున్నారని తెలిపారు.CCPA చట్టం ప్రకారం.. వినియోగదారులను ప్రభావితం చేసే.. తప్పుదారి పట్టించే ప్రకటనలను క్రమబద్దీకరించడానికి నిబంధనలు అవసరమని తెలిపారు. అయితే .. ప్రకటనలు మరింత స్పష్టంగా, అవగాహన కల్పించడానికి, ప్రభుత్వం నేటి నుండి న్యాయమైన ప్రకటనల కోసం మార్గదర్శకాలను రూపొందించిందని చెప్పారు.
ప్రింట్, టెలివిజన్, ఆన్లైన్ వంటి అన్ని ప్లాట్ఫారమ్లలో ప్రచురించబడే ప్రకటనలకు ఈ మార్గదర్శకాలు వర్తిస్తాయని, కొత్త మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ (CCPA) నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోబడుతాయని తెలిపారు. వినియోగదారుల రక్షణ చట్టం (CPA) నిబంధనల ప్రకారం.. కొత్త మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే.. చర్చలు తీసుకోనున్నది. మొదటి తప్పుకు ₹ 10 లక్షలు, తదుపరి ఉల్లంఘనకు ₹ 50 లక్షల వరకు జరిమానా విధిస్తుంది. అలాగే.. ఆ ప్రకటనలపై నిషేధం విధించవచ్చు.
ఈ సందర్బంగా రెగ్యులేటర్ సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) చీఫ్ కమిషనర్, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి నిధి ఖరే మార్గదర్శకాలను వివరిస్తూ.. ఇలా అన్నారు. మహమ్మారి సమయంలో తప్పుదోవ పట్టించే ప్రకటనలపై CCPA చర్య తీసుకుంది. ప్రకటనపై మార్గదర్శకాలు ఉండాల్సిన అవసరం ఉందని భావించామని, వాటాదారులు కూడా ఈ మార్గదర్శకాలను తెలుసుకోవాలని, వీటిని ఉల్లంఘించవద్దని పేర్కొన్నారు.
గత వారం ఓ డియోడరెంట్ కంపెనీ విడుదల చేసిన వివాదాస్పద ప్రకటనపై కేంద్రం వేటు వేసింది. వివాదాస్పద కంటెంట్ ఉన్న పెర్ఫ్యూమ్ ప్రకటనను వెంటనే తొలగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రకటనపై పలువురు స్పందిస్తూ.. అందులో రేప్ కల్చర్ను ప్రచారం చేశారని అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో గత శనివారం మంత్రిత్వ శాఖ ఆ యాడ్ ని తొలగించాలని ఆదేశించింది. ఇటువంటి వివాదాస్పద ప్రకటనలను ప్లాట్ఫారమ్ నుండి తొలగించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రిత్వ శాఖ ట్విట్టర్, యూట్యూబ్లను కోరింది.