
న్యూఢిల్లీ: ముహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నేత నుపుర్ శర్మ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా నిరసనలు తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా ముస్లిం దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కొన్ని దేశాలైతే భారత అంబాసిడర్లకు సమన్లు జారీ చేశాయి. దేశంలోనూ ఘర్షణలకు దారి తీసింది. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ బహిష్కృత రచయిత్రి తస్లీమా నస్రీన్ తన అభిప్రాయాలు వెల్లడించారు. ఒక వేళ ఈ రోజుకీ ముహమ్మద్ ప్రవక్త జీవించి ఉంటే.. ముస్లిం మూఢులను చూసి షాక్ అయ్యేవారు అని ట్వీట్ చేశారు.
ఒక వేళ ఇప్పటికీ ముహమ్మద్ ప్రవక్త జీవించి ఉంటే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం మూఢ భక్తులను చూసి ఖంగుతినేవారని శుక్రవారం ట్విట్టర్లో ట్వీట్ చేశారు. రెండ రోజుల క్రితం ఇలాంటి విమర్శనాత్మక ట్వీట్ ఒకటి పోస్టు చేశారు.
ఎవరూ విమర్శలకు అతీతులు కారని ఆమె ఈ నెల 8వ తేదీన ట్వీట్ చేశారు. ఏ మనిషి, ఏ దేవుడూ ఇందుకు అతీతులు కాదని స్పష్టం చేశారు. ప్రపంచం మరింత పురోగమించాలంటే విమర్శనాత్మక పరిశీలన అత్యవసరం అని అభిప్రాయపడ్డారు.
బంగ్లాదేశ్కు చెందిన తస్లీమా నస్రీన్ రాసిన లజ్జ నవల విశేష ఆదరణ పొందింది. కానీ, ఈ నవలపై బంగ్లాదేశ్లోని ఫండమెంటలిస్టులు కన్నెర్ర జేశారు. ఆమెకు ఇస్లాం విరుద్ధ ఆలోచనలు ఉన్నాయని ఆమెపై ఫండమెంటలిస్టులు సీరియస్ అయ్యారు. చంపేస్తామనే బెదిరింపులు ఎక్కువ కావడంతో ఆమె 1994లో బంగ్లాదేశ్ను విడిచి పెట్టారు.
ఆమెకు స్వీడిష్ పౌరస్తవం ఉన్నది. ఆమె యూరప్, యూఎస్లలో సుమారు రెండు దశాబ్దాలుగా నివసించారు. కానీ, భారత్లో నివసించడానికి ఆమె ఎక్కువ మొగ్గు చూపుతారు. భారత్లోనే శాశ్వతంగా జీవించాలని ఆమె చాలా సార్లు అభిలాషించారు.