
కేరళలోని కోజికోడ్లో కదులుతున్న రైలులో ఓ వ్యక్తి తోటి ప్రయాణికులపై పెట్రోల్ పోసి నిప్పటించిన ఘటన తీవ్ర సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ముమ్మర దర్యాప్తు కొనసాగుతుంది. అయితే తోటి ప్రయాణికులపై పెట్రోల్ పోసి నిప్పంటించిన షారుక్ సైఫీకి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఇంటెలిజెన్స్ బ్యూరో వంటి కేంద్ర ఏజెన్సీలు నిర్ధారించాయి. ఢిల్లీలోని షాహీన్ బాగ్ నివాసి అయిన షారుక్ సైఫీ ఒంటరిగా కేరళకు వెళ్లలేదని కేంద్ర దర్యాప్తు సంస్థలు చెబుతున్నాయి. అతడిని మొత్తం రైలు బోగీని తగలబెట్టి భారీ దాడి చేయడమే లక్ష్యంగా కేరళకు తీసుకొచ్చారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.
నివేదికల ప్రకారం.. నిందితుడు తీవ్రవాద భావజాలంతో ప్రభావితమయ్యాడు. భారీ టెర్రరిస్టు గ్రూపు ద్వారా నేరాన్ని నిర్వహించేలా ప్రోత్సహించబడ్డాడు. అదేవిధంగా.. కాల్పుల దాడిని నిర్వహించడానికి అతడు అవసరమైన సహాయాన్ని పొందాడు. దాడి లక్ష్యంగా కేరళలో అలప్పుజా-కన్నూరు ఎగ్జిక్యూటివ్ ఎక్స్ప్రెస్లను ఎంపిక చేయడం వెనుక కుట్ర ఉందని కేంద్ర ఏజెన్సీలు అనుమానిస్తున్నాయి. షారుక్ సైఫీ తన ప్రణాళికలో విజయం సాధించినట్లయితే.. హిందుస్థాన్ పెట్రోలియం చమురు ట్యాంకులు సమీపంలో ఉన్నందున దాడి విపత్తుగా మారి ఉండేదని ఆ ఏజెన్సీ పేర్కొంది.
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) నలుగురు సభ్యుల బృందం సంఘటనా స్థలాన్ని సందర్శించి.. సంఘటన జరిగిన తీరు ఆరా తీసింది. ఈ సంఘటనకు ఉగ్రవాద సంబంధాలు ఉన్నాయని అనుమానాలు కూడా వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. అయితే కేంద్ర ఏజెన్సీ మాత్రం అధికారికంగా విచారణ చేపట్టలేదు. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలు ఎన్ఐఏ స్వీకరించినట్లయితే.. సైఫీపై చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (యూఏపీఏ) కింద అభియోగాలు మోపవచ్చు. అలా అయితే.. అతను దాదాపు యూఏపీఏ సెక్షన్ 16 ఆరోపణలను ఎదుర్కోవలసి ఉంటుంది.
ఇదిలా ఉంటే.. ఈ కేసులో ఉగ్రవాద కోణం ఉన్నట్లు ఎన్ఐఏ అనుమానిస్తున్నప్పటికీ.. ఈ సంఘటన ఉగ్ర చర్యగా కనిపించడం లేదని రాష్ట్ర పోలీసులు తెలిపారు. కేరళ పోలీసులు షారుక్ సైఫీకి ఉన్న ఉగ్రవాద సంబంధాలపై వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. ఈ విషయంపై కేరళ పోలీసు చీఫ్ అనిల్ కాంత్ మాట్లాడుతూ.. కోజికోడ్ రైలు దగ్ధం కేసులో నిందితుడు షారుక్ సైఫీకి ఉగ్రవాద సంబంధాలు ఉన్నాయా లేదా అనే దానిపై పోలీసులు వ్యాఖ్యానించే స్థితిలో లేరని అన్నారు.
ఇక, ఈ కేసుకు సంబంధించి సైఫీని ఏప్రిల్ 5వ తేదీన మహారాష్ట్రలోని రత్నగిరిలో అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి కోజికోడ్కు తరలించి.. కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చేర్పించి ప్రత్యేక సెల్ రూమ్లో పోలీసులు నిఘా పెట్టారు. అతను డిశ్చార్జ్ అయ్యేంత ఫిట్గా ఉన్నాడని మెడికల్ బోర్డు చెప్పడంతో స్థానిక కోర్టు అతన్ని జ్యుడీషియల్ కస్టడీకి రిమాండ్ చేసింది.
అసలేం జరిగింది..
అలప్పుజా-కన్నూర్ ఎగ్జిక్యూటివ్ ఎక్స్ప్రెస్లో ప్రయాణికులపై సైఫీ పెట్రోల్ పోసి నిప్పంటించడంతో ముగ్గురు వ్యక్తులు మరణించారు. చాలా మంది గాయపడ్డారు.
కదులుతున్న రైలులో తోటి ప్రయాణికులపై మండే ద్రవాన్ని పోసి నిప్పంటించడానికి సైఫీ ఆదివారం రాత్రి 9.45 గంటలకు కోజికోడ్లో అలప్పుజా-కన్నూరు ఎగ్జిక్యూటివ్ ఎక్స్ప్రెస్ రైలు ఎక్కినట్లు సమాచారం. ఈ ఘటన తర్వాత ఎలత్తూరు స్టేషన్ సమీపంలో రైలు పట్టాలపై మహిళ, ఒక పురుషుడు, చిన్నారి మృతదేహాలు లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. ముగ్గురు వ్యక్తులు మంటలు చెలరేగడంతో తప్పించుకునేందుకు ప్రయత్నించారని.. ఈ క్రమంలోనే రైలు నుంచి దూకి పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.