Bengal bypolls: వేడెక్కుతున్న రాజకీయం.. మృతదేహంతో ఊరేగింపు.. బీజేపీ అభ్యర్థి ప్రియాంకపై కేసు

By telugu teamFirst Published Sep 24, 2021, 5:36 PM IST
Highlights

పశ్చిమ బెంగాల్‌లో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. ఉపఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ నేతలు సీఎం మమతా బెనర్జీ నివాసం ముందు ఆ పార్టీ నేత దూర్జటి సాహా మృతదేహాంతో ర్యాలీ తీశారు. ఈ ర్యాలీ ఉద్రిక్తతలకు దారితీయడంతో బీజేపీ అభ్యర్థి ప్రియాంక తబ్రేవాల్ సహా పార్టీ అధ్యక్షుడు సుకంత మజుందార్, మరో ఇద్దరు ఎంపీలపై కేసు నమోదైంది.

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ఉపఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయం రసవత్తరంగా మారుతున్నది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నుంచే బీజేపీ, టీఎంసీల మధ్య పచ్చగడ్డి వేస్తే అంటుకునే పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా మూడు స్థానాలకు ఉపఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ వెలువడటం, అభ్యర్థులు నామినేషన్లు వేయడం వంటి కార్యక్రమాలతోపాటు అనూహ్య రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా, సీఎం మమతా బెనర్జీపై పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి ప్రియాంక తబ్రేవాల్‌పై కేసు నమోదవడం మరో మలుపునకు దారి తీసింది.

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో,  కౌంటింగ్ తర్వాత హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనల్లో ఇరుపార్టీల కార్యకర్తలు మరణించారు. బీజేపీ కార్యకర్తలను కావాలనే టీఎంసీ గూండాలు హతమార్చారని కమలం పార్టీ అప్పట్లో తీవ్ర ఆరోపణలు చేసింది. ఈ ఘటనల్లోనే దక్షిణ 24 పరగణాల జిల్లాలో మగ్రాహత్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన దూర్జటి సాహా కూడా తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఆయన చికిత్స పొందుతూనే ఉన్నారు. బుధవారం మరణించారు. బీజేపీ అభ్యర్థి ప్రియాంక తబ్రేవాల్, పార్టీ రాష్ట్ర విభాగం అధ్యక్షుడు సుకంత మజుందార్, ఎంపీ అర్జున్ సింగ్‌లు దూర్జటి సాహా మృతదేహాంతో సీఎం మమతా బెనర్జీ నివాసం ఎదుట భారీ ర్యాలీ తీశారు.

అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందు జాగ్రత్తగా పోలీసులు ఆ మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించాలని భావించారు. మృతదేహమున్న కారును ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. కానీ, పార్టీ అధ్యక్షుడు సుకంత మజుందార్ ఆ కార్‌కు అడ్డంగా నేలపై కూర్చుని ఆందోళన చేశారు. ఆయనను తప్పించే క్రమంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

అనంతరం ఈ ఘటనపై ప్రియాంక తబ్రేవాల్, సుకంత మజుందార్ సహా ఎంపీ జ్యోతిర్మయి సింగ్ మహతో, ఎంపీ అర్జున్ సింగ్‌లపై కేసు నమోదైంది.

click me!