హిందువులంతా కత్తులు పట్టాల్సిందే.. సాధ్వీ సరస్వతి సంచలన వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Dec 14, 2021, 4:59 PM IST
Highlights

విశ్వ హిందూ పరిషత్ (VHP) నాయకురాలు సాధ్వీ స‌ర‌స్వ‌తి (sadhvi saraswati) వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. హిందువులందరూ (hindus) తమ ఇళ్లను, గోవులను కాపాడుకునేందుకు క‌త్తులు చేతబట్టాలంటూ పిలుపునిచ్చారు.

విశ్వ హిందూ పరిషత్ (VHP) నాయకురాలు సాధ్వీ స‌ర‌స్వ‌తి (sadhvi saraswati) వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. హిందువులందరూ (hindus) తమ ఇళ్లను, గోవులను కాపాడుకునేందుకు క‌త్తులు చేతబట్టాలంటూ పిలుపునిచ్చారు. వివరాల్లోకి వెళితే.. ఆదివారం కర్ణాటకలోని (karnataka) ఉడిపి (udupi) కర్కాలా గాంధీ మైదాన్ లో వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ (bajrang dal) కలిసి నిర్వహించిన హిందూ సంఘమ కార్యక్రమంలో సాధ్వి స‌ర‌స్వ‌తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా గోమాత (cow) గౌరవించబడుతోందని, కానీ కర్ణాటకలో మాంసం కోసం ఆవును చంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇలాంటి వధకులకు ఈ దేశంలో జీవించే హక్కు లేదని.. హిందువుల గోశాలలో ఆయుధాలు చూపిస్తూ ఆవులను దొంగిలిస్తున్నారని సరస్వతి ఆరోపించారు. గోమాతను కాపాడేందుకు మనమందరం కత్తులు చేతబట్టాలని ఆమె పిలుపునిచ్చారు. లక్షల రూపాయల విలువైన ఫోన్‌లను కొనుగోలు చేయగలిగినప్పుడు, ఖచ్చితంగా కత్తులు కొనుగోలు చేయవచ్చంటూ వ్యాఖ్యానించారు. గోశాల‌లో పుట్టిన తాను గోవ‌ధ‌ను అడ్డుకోవ‌డం బాధ్య‌త‌గా ముందుకెళ‌తాన‌ని సాధ్వి స‌ర‌స్వ‌తి స్పష్టం చేశారు. దేశంలో గోవ‌ధ‌ను అరిక‌ట్ట‌డం, రామ మందిర నిర్మాణం జ‌ర‌గ‌డం అనే రెండు తీర్మానాల‌ను తాను చిన్న‌త‌నంలోనే తీసుకున్నాన‌ని ఆమె వెల్లడించారు.

కొందరు దేశ వ్యతిరేకులు కర్ణాటకలో టిప్పు సుల్తాన్‌ను ప్రశంసిస్తున్నారని … అటువంటి వారికి వ్యతిరేకంగా నిరసన తెలపాలని సాధ్వి స‌ర‌స్వ‌తి పిలుపునిచ్చారు. గోహత్య, మతమార్పిడి, లవ్ జిహాద్‌పై ప్రభుత్వం కఠినమైన చట్టాలను తీసుకురావాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రతి ఆత్మా భగవంతుని బిడ్డ అని, ప్రతి ప్రాణం దివ్యమని భగవద్గీత చెబుతోందని.. గోహత్యను అంతం చేయాలి అని సాధ్వి పిలుపునిచ్చారు. 

click me!