Cancer: పురుషులతో పోలిస్తే మ‌హిళ‌ల్లో పెరుగుతున్న క్యాన్స‌ర్ మ‌ర‌ణాలు.. తాజా అధ్య‌యనంలో షాకింగ్ విష‌యాలు

By Mahesh RajamoniFirst Published Jul 30, 2023, 11:42 AM IST
Highlights

Cancer: పురుషులతో పోలిస్తే క్యాన్స‌ర్ తో మరణిస్తున్న మహిళలే ఎక్కువగా ఉన్నార‌ని తాజాగా ఒక అధ్యయనం వెల్ల‌డించింది. 2000-2019 మధ్య ఊపిరితిత్తులు, రొమ్ము, కొలొరెక్టమ్, లింఫోమా, మల్టిపుల్ మైలోమా, పిత్తాశయం, ప్యాంక్రియాస్, మూత్రపిండాలు, మెసోథెలియోమా క్యాన్సర్లలో మరణాల ధోరణులు పెరుగుతున్నట్లు అధ్యయనం కనుగొంది. 
 

More women dying of cancer: పురుషులతో పోలిస్తే క్యాన్స‌ర్ తో మరణిస్తున్న మహిళలే ఎక్కువగా ఉన్నార‌ని తాజాగా ఒక అధ్యయనం వెల్ల‌డించింది. 2000-2019 మధ్య ఊపిరితిత్తులు, రొమ్ము, కొలొరెక్టమ్, లింఫోమా, మల్టిపుల్ మైలోమా, పిత్తాశయం, ప్యాంక్రియాస్, మూత్రపిండాలు, మెసోథెలియోమా క్యాన్సర్లలో మరణాల ధోరణులు పెరుగుతున్నట్లు అధ్యయనం కనుగొంది.  భారతదేశంలో క్యాన్సర్ మరణాల ధోరణి పురుషులలో ఏటా 0.19 శాతం తగ్గుతుండగా, మహిళల్లో 0.25 శాతం పెరిగిందని, ఇది పురుషులు-మహిళలు కలిపి ఇద్దరిలో 0.02 శాతం పెరిగిందని తాజా అధ్యయనం తెలిపింది. అమెరికన్ సొసైటీ ఆఫ్ క్లినికల్ ఆంకాలజీకి అనుబంధంగా ఉన్న జేసీవో గ్లోబల్ ఆంకాలజీలో ప్రచురితమైన ఈ అధ్యయనాన్ని అమృత ఆసుపత్రికి చెందిన అజిల్ షాజీ, డాక్టర్ పవిత్రన్ కె, డాక్టర్ విజయ్ కుమార్ డికె, డబ్ల్యూహెచ్ఓ విభాగమైన ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ కు చెందిన డాక్టర్ కేథరిన్ సౌవాగేట్ సహకారంతో నిర్వహించారు.

2000-2019 మధ్యకాలంలో 12.85 మిలియన్ల భారతీయులను పొట్టనబెట్టుకున్న భారతీయ జనాభాలో 23 ప్రధాన క్యాన్సర్ల మరణాల పోకడల విశ్లేషణలో భాగంగా ఈ విషయాలు వెల్లడయ్యాయి. అధ్యయనం ప్రకారం.. ఊపిరితిత్తులు, రొమ్ము, కొలొరెక్టమ్, లింఫోమా, మల్టిపుల్ మైలోమా, పిత్తాశయం, ప్యాంక్రియాస్, మూత్రపిండాలు మరియు మెసోథెలియోమా క్యాన్సర్లలో మరణాల ధోరణులు పెరిగాయి. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ మరణాల్లో అత్యధిక వార్షిక పెరుగుదల రెండు లింగాలలో 2.7 శాతం (పురుషులలో 2.1 శాతం, మహిళల్లో 3.7 శాతం) ఉందని తెలిపింది. అయినప్పటికీ, కడుపు, అన్నవాహిక, లుకేమియా, స్వరపేటిక, మెలనోమా క్యాన్సర్లు లింగంతో సంబంధం లేకుండా క్యాన్సర్ మరణాల ధోరణి తగ్గుతున్నట్లు చూపించాయి.

థైరాయిడ్ (0.6), పిత్తాశయం (0.6) క్యాన్సర్లు మినహా అన్ని సాధారణ క్యాన్సర్లకు మహిళల కంటే పురుషులలో క్యాన్సర్ మరణాలు ఎక్కువగా ఉన్నాయని అధ్యయనం కనుగొంది. స్వరపేటిక క్యాన్సర్ మహిళల కంటే పురుషులలో దాదాపు 6 రెట్లు ఎక్కువ మరణాలను కలిగి ఉంది. ఆ త‌ర్వాత ,ఊపిరితిత్తులు (2.9), మెలనోమా (2.5), మూత్రాశయం (2.3), నోరు, ఓరోఫారింక్స్ (2.2), కాలేయం (1.9), కడుపు, కొలొరెక్టల్ క్యాన్సర్ మరణాలు రెండు లింగాలలో సాపేక్షంగా సమానంగా ఉన్నాయి. భారతదేశ జనాభాలో క్యాన్సర్ మరణాల ధోరణులు నమోదు చేయబడలేదని అమృత ఆసుపత్రి క్యాన్సర్ రిజిస్ట్రీ హెడ్ అజిల్ షాజీ అన్నారు. గ్లోబల్ హెల్త్ అబ్జర్వేటరీ (జిహెచ్ఓ) డేటాబేస్ ఆధారంగా 2000-2019 మ‌ధ్య 23 ప్రధాన క్యాన్సర్ల మొత్తం, వ్యక్తిగత క్యాన్సర్ మరణాల ధోరణులను తాము విశ్లేషించిన‌ట్టు తెలిపారు.

click me!