Uttarakhand Election 2022- C Voter Exit Poll : ఈసారి అధికార మార్పిడే.. కాంగ్రెస్‌కు పట్టం

Siva Kodati |  
Published : Mar 07, 2022, 07:04 PM IST
Uttarakhand Election 2022- C Voter Exit Poll : ఈసారి అధికార మార్పిడే.. కాంగ్రెస్‌కు పట్టం

సారాంశం

ఉత్తరాఖండ్‌ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో ఏ పార్టీ అధికారాన్ని అందుకుంటుందా అన్న దానిపై జాతీయ స్థాయిలో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో సీ ఓటర్ నిర్వహించిన సర్వే ఫలితాలను వెల్లడించింది. 

ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు (five state election) సంబంధించిన పోలింగ్ నేటితో ముగిసింది. మార్చి 10వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ఫలితాలకు సంబంధించి వివిధ జాతీయ మీడియా సంస్థలు, ఏజెన్సీలు ఎగ్జిట్‌పోల్స్‌ను వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో ఉత్తరాఖండ్‌కు సంబంధించి సీ ఓటర్ (c voter exit poll uttarakhand 2022) నిర్వహించిన సర్వే ఫలితాలను ప్రకటించింది. దీని ప్రకారం కాంగ్రెస్ (congress), బీజేపీల (bjp) మధ్య హోరాహోరీ పోరు తప్పదని అంచనా వేసింది. అయితే ఈసారి మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని అందుకుంటుందని సీఓటర్ తెలిపింది.

ఉత్తరాఖండ్ ఎగ్జిట్ పోల్స్ ఇలా వున్నాయి:

బీజేపీ : 26 నుంచి 32 స్థానాలు
కాంగ్రెస్ : 32 నుంచి 38 స్థానాలు


ఉత్తరాఖండ్‌ విషయానికి వస్తే.. ఫిబ్రవరి 14న ఇక్కడ ఎన్నికలు జరగ్గా.. 65.37 శాతం పోలింగ్ నమోదైంది. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 82,38,187. మొత్తం పోలింగ్ స్టేషన్ల సంఖ్య 11,647. ఉత్తరాఖండ్‌లో 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. వీటిలో 13 స్థానాలు షెడ్యూల్డ్ కులాలకు (ఎస్‌సి) రిజర్వ్ కాగా.. 2 సీట్లు షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ అయ్యాయి. వివిధ పార్టీలకు చెందిన  632 మంది అభ్యర్ధులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ప్రస్తుతం పుష్కర్ సింగ్ ధామి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. 

బీజేపీ తరపు నుంచి మంత్రులు సత్పాల్ మహరాజ్, సుబోధ్ ఉనియాల్, అరవింద్ పాండే, ధన్ సింగ్ రావత్, రేఖా ఆర్య, బీజేపీ ఉత్తరాఖండ్ రాష్ట్ర అధ్యక్షుడు మదన్ కౌశిక్ ఉన్నారు. ప్రముఖ కాంగ్రెస్ అభ్యర్థులలో మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్, మాజీ మంత్రి యశ్పాల్ ఆర్య, కాంగ్రెస్ ఉత్తరాఖండ్ యూనిట్ అధ్యక్షుడు గణేష్ గోడియాల్, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ప్రీతమ్ సింగ్ ఉన్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 57, కాంగ్రెస్ 11, స్వతంత్ర అభ్యర్థులు రెండు స్థానాల్లో విజయం సాధించారు.

ప్ర‌ముఖ ద‌ళిత నేత ఆర్య‌, త‌న కుమారుడు సిట్టింగ్ ఎమ్మెల్యేతో క‌లిసి కాంగ్రెస్‌లోకి తిరిగి రావ‌డం హస్తం శ్రేణుల్లో జోష్ నింపింది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పాల‌క బీజేపీని దీటుగా ఎదుర్కొని అధికారాన్ని చేప‌ట్టాల‌ని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది. ఈసారి ఉత్తరాఖండ్  ఎన్నికల బరిలో నిలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్‌వాదీ పార్టీలు కూడా ముమ్మరంగానే ప్రచారం నిర్వహించాయి. గత కొన్నేళ్లుగా బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోటీ వుంటోంది. ప్రజలు సైతం ప్రభుత్వాలను మారుస్తున్నారు. దీంతో బీజేపీ, కాంగ్రెస్‌లు ఐదేళ్లకొకసారి అధికారాన్ని అందుకుంటున్నాయి. ఇదే సమయంలో ఈసారి ఆప్ బరిలో నిలవడంతో ఈ రెండు పార్టీల విజయావకాశాలకు దెబ్బ కొట్టే పరిస్ధితులు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. 

రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి  కార్యక్రమాలు, రైల్వే, రహదారుల నిర్మాణం, కేదార్‌నాథ్ ఆలయ పునర్నిర్మాణం వంటి వాటిని బీజేపీ విస్తృతంగా ప్రచారం చేసింది. అయితే నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ముఖ్యమంత్రుల మార్పు వంటి అంశాలను అస్త్రాలుగా చేసుకుని కాంగ్రెస్ విమర్శలు చేసింది. అటు ఆప్ విషయానికి వస్తే.. 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, 18 ఏళ్లు పైబడిన మహిళకు నెలకు రూ.1000 ఆర్ధిక సాయం, కుటుంబానికో ఉద్యోగం, రూ.5 వేల నిరుద్యోగ  భృతి వంటి ప్రజాకర్షక హామీలను ప్రకటించింది.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu