
ఇండో పాక్ బోర్డర్: భారత్-పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దులో పాకిస్థాన్ చేష్టలు మితిమిరుతున్నాయి. నిత్యం డ్రగ్స్ స్మగ్లింగ్, ఆయుధాలను అక్రమ రవాణా చేస్తునే ఉంది. కానీ.. భారత సైన్యం( BSF) ప్రతిరోజూ పాక్ కుట్రలను విఫలం చేస్తుంది. ఆదివారం సాయంత్రం పాకిస్తాన్ స్మగ్లర్లు రాత్రి చీకటిలో డ్రోన్ల ద్వారా అక్రమ రవాణా చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అదే జరిగింది,అక్రమంగా దేశంలోకి చొరబడ్డ ఆ డ్రోన్ను కాల్చివేసి, రవాణా చేయబడిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
బీఎస్ఎఫ్ BSF 22 బెటాలియన్ సిబ్బంది అమృత్సర్ జిల్లాలోని ఇండో-పాకిస్తాన్ సరిహద్దు సరిహద్దు అవుట్పోస్ట్ వద్ద రానియా సెక్టార్లో వచ్చిన ఆక్టా-కాప్టర్ (8 ప్రొపెల్లర్లు)ను కాల్చివేశారు. ఈ డ్రోన్ రాత్రి 9.15 గంటలకు భారత సరిహద్దుల్లోకి చొరబడేందుకు ప్రయత్నించిందని ఆర్మీ అధికారులు తెలిపారు. ఈ డ్రోన్ బరువు 12 కిలోలు కాగా అందులో కొన్ని వస్తువులు కూడా లభ్యమయ్యాయి. అయితే, రికవరీ చేసిన వస్తువులకు సంబంధించిన సమాచారాన్ని మాత్రం బీఎస్ఎఫ్ తెలియజేయలేదు.
పాకిస్థాన్ వైపు నుంచి వస్తున్న డ్రోన్ను బీఎస్ఎఫ్ కూల్చివేయడం ఇదే తొలిసారి కాదు. బీఎస్ఎఫ్ కు దాదాపు ప్రతిరోజూ ఇటువంటి సంఘటనలను ఎదుర్కొంటోంది. సీనియర్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారి ప్రకారం.. సరిహద్దు గుండా ఆయుధాలు మరియు డ్రగ్స్ అక్రమ రవాణా చేయడానికి పాకిస్తాన్ డ్రోన్లను ఉపయోగిస్తున్నారు.వాటినిఎదుర్కోవడం భద్రతా సిబ్బందికి సవాలుగా మారింది.
బీఎస్ఎఫ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శీతాకాలం సమీపిస్తోందని, ఈ సీజన్లో దేశంలోకి ఉగ్రవాదుల చొరబాట్లు పెరుగుతాయన్నారు. వాటిని ఎదుర్కోవడానికి టెక్నాలజీ అంతా సిద్ధంగా ఉందని తెలిపారు. మరో నెల రోజుల్లో సరిహద్దుల్లో మరిన్ని కొత్త నిఘా పరికరాలు అందుబాటులోకి రానున్నాయి. రాత్రిపూట నిఘా వ్యూహం కూడా సిద్ధంగా ఉంది, చలికాలంలో కూడా చొరబాటు (ఉగ్రవాదులకు) అసాధ్యమని పేర్కొన్నారు.