భార్య మరణ వార్త తట్టుకోలేక.. తుపాకీతో కాల్చుకున్న బీఎస్ఎఫ్ జవాన్..

By Rajesh KarampooriFirst Published Oct 19, 2023, 6:45 AM IST
Highlights

భార్య మరణ వార్త విన్న బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 

జైపూర్: రాజస్థాన్‌లోని కోట్‌పుట్లీ-బెహ్రోర్ జిల్లా హర్సౌరా పోలీస్ స్టేషన్ పరిధిలో గత రాత్రి ఓ వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. జమ్మూ కాశ్మీర్‌లోని కుప్వారాలో ఉన్న తన భర్తకు ఈ సమాచారం తెలియగానే.. అతడు తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు బుధవారం పోలీసులు సమాచారం అందించారు. మంగళవారం రాత్రి ధీర్‌పూర్ గ్రామంలో అన్షు యాదవ్ (24) అనే వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు తెలిపారు. దీనిపై సమాచారం అందుకున్న అన్షు భర్త రాజేంద్ర యాదవ్ (28) తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌లో పనిచేస్తున్న రాజేంద్ర జమ్మూ కాశ్మీర్‌లోని కుప్వారాలో హెడ్ కానిస్టేబుల్‌గా నియమితులయ్యారు. పోస్టుమార్టం అనంతరం మహిళ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు పోలీస్ స్టేషన్ ఆఫీసర్ రాజేష్ మీనా తెలిపారు. అన్షు యాదవ్ భర్త కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు ధృవీకరించారు.  జమ్మూలోని కుప్వారాలో బిఎస్‌ఎఫ్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న అన్షు యాదవ్ భర్త రాజేంద్ర యాదవ్ ఆత్మహత్యను కుటుంబ సభ్యులు కూడా ధృవీకరించారు.  

ఫోన్‌లో ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు ప్రాథమికంగా వెలుగులోకి వచ్చిందని చెప్పారు. బహుశా ఆ తర్వాతే ఆ  వివాహిత ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది.ఎనిమిది నెలల క్రితమే వారిద్దరూ పెళ్లి చేసుకున్నారని సమాచారం. దీనిపై క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 176 కింద కేసు నమోదు చేసి విచారణను సబ్ డివిజనల్ అధికారికి అప్పగించినట్లు తెలిపారు. రాజేంద్ర యాదవ్ మృతదేహాన్ని గురువారం ఇక్కడికి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకోవడానికి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.

click me!