
న్యూఢిల్లీ: భారత్ విభజన కేవలం భౌగోళిక విభజనే కాదు. సాంప్రదాయాల విభజన, ఆచారాల విభజన, అనుబంధాల విభజన, కుటుంబాల విభజనగా మారింది. ఆగమేఘాల మీద శాశ్వతంగా పాకిస్తాన్ తరలివెళ్లిన కుటుంబాల తొలితరం ప్రతి రోజూ భారతదేశ కలకన్నదేమో. మరెందరో తప్పిపోయిన ఆప్తులు, కన్నపేగుల గురించి కలవరపడిందో.. పాకిస్తాన్లోని సకీనా మాత్రం భారత్లో ఉండిపోయిన అన్న గుర్మైల్ సింగ్ గురించి బాల్యం నుంచి ఆలోచిస్తున్నది. కలిసి తినకున్నా.. కలిసి పెరగకున్నా.. తన అన్నను చూడాలని రక్తం పంచుకుపుట్టిన చెల్లి ఆరాటపడింది. తాజాగా, ఆమె కల నెరవేరింది. కర్తార్పూర్ కారిడార్లో ఈ అపురూప కలయిక జరిగింది.
దేశ విభజన సమయంలో పంజాబ్కు చెందిన గుర్ మైల్ సింగ్ కుటుంబం పాకిస్తాన్ వెళ్లడానికి నిర్ణయించుకుంది. అప్పుడు గుర్మైల్కు ఐదేళ్లు. పాకిస్తాన్ వెళ్లే ముందు గుర్మైల్ కనిపించకుండా పోయాడు. కుటుంబం, ఆర్మీ అంతా వెదికినా ఎక్కడా కనిపించలేదు. దీంతో చేసేదేమీ లేక ఆ కుటుంబం శోకంతోనే సరిహద్దు దాటి పాకిస్తాన్ చేరుకుంది. పాకిస్తాన్ వెళ్లిన తర్వాత ఆ దంపతులకు బిడ్డ పుట్టింది. ఆమెనే గురుమైల్ సింగ్ సోదరి సకీనా.
1955లో పుట్టిన సకీనా వయసు ఇప్పుడు 68 ఏళ్లు. చిన్నప్పటి నుంచి అన్నను కలవాలనే ఆశతో పెరిగిన సకీనా ఓ యూట్యూబ్చానల్ సాయంతో కనిపించకుండా పోయిన తన అన్నను గుర్తించింది. సకీనా పెద్దయ్యాక తండ్రి తన సోదరుడి ఫొటో చూపెట్టి విభజన సమయంనాటి ఆ ఎడబాటు గురించి వివరించాడు. అప్పటి నుంచి అన్నను చూడాలని సకీనా ఎదరుచూసింది.
Also Read: భర్తను నల్లవాడని పిలవడం క్రూరత్వమే: దంపతులకు విడాకులు మంజూరు చేసిన హైకోర్టు
పాకిస్తాన్ యూట్యూబ్ చానల్లో గుర్మైల్ చిన్నప్పటి ఫొటోలు, పాకిస్తాన్కు వచ్చిన కొత్తలో అమ్మానాన్నలకు ఆయన రాసిన లేఖలు పెట్టగా గుర్మైల్ ఆచూకీ దొరికిందని సకీనా చెమ్మగిల్లే కళ్లతో తెలిపింది.
ఈ అన్నా చెల్లి తొలిసారిగా పాకిస్తాన్లోని కర్తార్పూర్ కారిడార్లో కలిశారు. కన్నీటిపర్యంతమయ్యారు. 81 ఏళ్ల వయసులో తన సోదరి సకీనా కలవడం తనకు సంతోషంగా ఉన్నదని గుర్మైల్ చెప్పాడు.