దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన.. మైనర్ బాలికపై యాసిడ్ దాడి..

By Sumanth KanukulaFirst Published Dec 14, 2022, 11:32 AM IST
Highlights

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ద్వారక జిల్లా ప్రాంతంలో ఓ యువతిపై యాసిడ్ దాడి జరిగింది. ఈ ఘటనలో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. 

దేశంలో నిత్యం ఏదో ఒకచోట మహిళలు, అమ్మాయిలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్న కొందరు మృగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో మైనర్ బాలికపై యాసిడ్ దాడి జరిగింది. ఈ ఘటనలో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. బాధిత బాలికను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలిక ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతుంది. ఈ విషయాన్ని ఢిల్లీ  పోలీసులు ధ్రువీకరించారు. 

ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ సమీపంలో 17 ఏళ్ల బాలికపై బుధవారం ఉదయం ఇద్దరు బైక్ రైడర్లు యాసిడ్ లాంటి పదార్థంతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నట్టుగా చెప్పారు. మోహన్ గార్డెన్ ప్రాంతంలోని పోలీస్ స్టేషన్‌కు యువతిపై యాసిడ్ పోసిన ఘటనకు సంబంధించి ఉదయం 9 గంటలకు పీసీఆర్ కాల్ వచ్చిందని ఢిల్లీ పోలీసులు తెలిపారు.  

‘‘ఈరోజు ఉదయం 7.30 గంటల సమయంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు 17 ఏళ్ల బాలికపై యాసిడ్ లాంటి పదార్ధంతో దాడి చేశారని చెప్పబడింది” అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ద్వారక) ఎం హర్ష వర్ధన్ తెలిపారు. దాడికి పాల్పడినవారి ఇద్దరు పేర్లను బాలిక చెప్పిందని.. వారిలో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని డీసీపీ తెలిపారు.

click me!