పబ్‌జీ వ్యసనం.. తాతకే మస్కా వేసిన మనవడు: రూ.2.35 లక్షలు ట్రాన్స్‌ఫర్

By Siva KodatiFirst Published Sep 8, 2020, 4:51 PM IST
Highlights

ప్రపంచవ్యాప్తంగా చిన్నారులు, యువత పబ్ జీ గేమ్‌కు బానిసలుగా మారిపోతున్నారు. ఇప్పటికే దీని కారణంగా ఎన్నో దారుణాలు జరిగాయి. ఆత్మహత్యలు, హత్యలకు కొదవే లేదు.

ప్రపంచవ్యాప్తంగా చిన్నారులు, యువత పబ్ జీ గేమ్‌కు బానిసలుగా మారిపోతున్నారు. ఇప్పటికే దీని కారణంగా ఎన్నో దారుణాలు జరిగాయి. ఆత్మహత్యలు, హత్యలకు కొదవే లేదు. తాజాగా పబ్ జీ కోసం ఓ బాలుడు తన తాత పెన్షన్ ఖాతా నుంచి రూ.2.35 లక్షల రూపాయలను బదిలీ చేశాడు.

కొద్దిరోజుల క్రితం బాధితుడైన తాతకి తన అకౌంట్ ఖాతా నుంచి 2,500 డ్రా అయినట్లు మెసేజ్ రావడమే కాక ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ 275గా చూపించచింది. ఈ మెసేజ్ చూసిన ఆయన షాక్‌కు గురయ్యాడు.

వెంటనే బ్యాంక్‌కు వెళ్లి తనకు వచ్చిన మెసేజ్ గురించి విచారించగా.. అతని పెన్షన్ ఖాతా నుంచి 2,34,000 బదిలీ అయినట్లు తేలింది. దీనిపై ఖంగుతిన్న బాధితుడు వెంటనే ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

తాను ఎటువంటి లావాదేవీలు చేయలేదని.. తన మొబైల్‌కు ఓటీపీ కూడా రాలేదని తెలిపాడు. రంగంలోకి దిగిన పోలీసులు గత రెండు నెలలుగా బాధితుడి ఖాతా నుంచి 2,34,497 రూపాయలు బదిలీ అయినట్లు గుర్తించారు.

పంకజ్ కుమార్ అనే వ్యక్తి పేరిట వున్న పేటిఎం ఖాతాకు చెల్లింపులు జరుగుతున్నట్లు పోలీసులు కనుగొన్నారు. దీంతో సైబర్ సెల్ పంకజ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించింది.

ఈ సందర్భంగా తన స్నేహితులలో ఒకరు అతని ఐడీ, పేటీఎం ఖాతా పాస్‌వర్డ్ అడిగినట్లు తెలిపాడు. సదరు వ్యక్తి పబ్ జీ కోసం గూగుల్ పే చెల్లింపులు చేయడానికి పంకజ్ ఖాతాను ఉపయోగించినట్లు పోలీసులు కనుగొన్నారు. విచారణలో భాగంగా సదరు వ్యక్తిని ఫిర్యాదుదారుడి మనవడిగా గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు.

తన తాత ఖాతా నుంచి పబ్ జీ ఆడటానికి నదగు బదిలీ చేసినట్లు నిందితుడు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. బ్యాంక్ ఖాతా హ్యాకింగ్ అవుతుందని చెప్పి తన తాత మొబైల్ ఫోన్ నుంచి ఓటీపి మెసేజ్‌లను తొలగించేవాడనని టీనేజర్ పోలీసులకు  తెలిపాడు. 

click me!