ఆ యువకుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.. ఇది భద్రతా వైఫల్యం కాదు..

By SumaBala BukkaFirst Published Jan 13, 2023, 7:44 AM IST
Highlights

ప్రధానిని కలవడానికి అత్యుత్సాహంతోనే ఆ యువకుడు పూలమాలవేసి ఉంటాడని.. ఇది భద్రతావైఫల్యం కాదని.. అయినా దీనిమీద తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు.
 

హుబ్బళ్లి : ప్రధానమంత్రి నరేంద్రమోదీ రోడ్‌షో సందర్భంగా ఆయనకు పూలమాల వేసేందుకు ప్రయత్నించిన బాలుడు స్థానికుడా అనే విషయంపై ఆరా తీస్తున్నట్లు కర్ణాటకలోని హుబ్బళ్లి పోలీసులు గురువారం తెలిపారు. ప్రాథమికంగా ఇది భద్రతా ఉల్లంఘనగా అనిపించడం లేదని హుబ్బళ్లి పోలీస్ కమిషనర్ రామన్ గుప్తా అన్నారు. బాలుడు అత్యుత్సాహంతో దీన్ని చేసి ఉంటాడని, అయితే దీనిమీద తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

"అతను (బాలుడు) స్థానికుడా? ఉత్సాహంతో అలా చేశాడా? అని మేం విచారిస్తున్నాం. అతన్ని వెంటనే భద్రతా సిబ్బంది ఆపారు. విచారణ కొనసాగుతోంది. ప్రాథమికంగా, ఇది భద్రతా ఉల్లంఘనగా అనిపించడం లేదు" అని గుప్తా చెప్పారు. "అతను అమాయకుడు, ఉత్సాహంతోనే దీన్ని చేసి ఉండాలి. అయినప్పటికీ, తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం" అని పోలీసు అధికారి తెలిపారు.

కర్ణాటకలో ప్రధాని మోడీకి భ్రదతా లోపం..సెక్యూరిటీని దాటుకుని ప్రధాని వద్దకు దూసుకొచ్చిన యువకుడు

హుబ్బళ్లిలో జాతీయ యువజనోత్సవాల ప్రారంభోత్సవానికి ముందు ప్రధాని రోడ్‌షో జరిగింది. ఈ సమయంలో ప్రధాని వాహనం వద్దకు దూసుకొచ్చిన బాలుడిని భద్రతా సిబ్బంది అక్కడి నుంచి తప్పించారు. కదులుతున్న వాహనం రన్నింగ్‌ బోర్డుపై నిల్చున్న ప్రధానికి జనాలు సంతోషంగా చేతులు ఊపుతుండగా.. ఓ యువకుడు అక్కడికి దూసుకువచ్చి పూలమాల వేశాడు. 

"ప్రధానమంత్రి భద్రతలో అలాంటి ఉల్లంఘన జరగలేదు" అని కర్ణాటక పోలీసులు ఇంతకు ముందే చెప్పారు. ఆ వ్యక్తి గురించి మరింత సమాచారం సేకరిస్తున్నారు. "ప్రధానమంత్రి భద్రతలో అలాంటి ఉల్లంఘన జరగలేదు. రోడ్‌షోలో ప్రధాని మోదీకి పూలమాల వేయడానికి ఒక వ్యక్తి ప్రయత్నించాడు. ఆ వ్యక్తి గురించి మరింత సమాచారం సేకరిస్తున్నాం" అని హుబ్బల్లి ధార్వాడ్ క్రైమ్ డిసిపి గోపాల్ బయాకోడ్ తెలిపారు. ప్రధానికి దండ వేయడానిక ఓ యువకుడు ప్రధాని వాహనం వద్దకు రావడంతో ప్రధానమంత్రి భద్రతా వలయం ఉల్లంఘన జరిగిందని నివేదికలు వచ్చిన నేపథ్యంలో అధికారి ఇలా స్పందించారు. 

ఇది తీవ్రమైన లోపం కాదని, అతడు ఎక్కడి నుంచి రాలేదని.. ఆ ఎన్‌క్లోజర్‌లో ఉన్న వ్యక్తులందరినీ ఎస్ఫీజీ సరిగ్గా పరీక్షించిందని, భద్రతా సంస్థలు ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టాయని తెలిపారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జాతీయ యువజనోత్సవాలను ప్రారంభించేందుకు హుబ్బలికి వచ్చిన ప్రధాని రోడ్‌షో నిర్వహించారు. నగరానికి వచ్చిన ప్రధానికి ఘనస్వాగతం లభించింది. రోడ్‌షో సందర్భంగా ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆయన అశ్వదళంపై పూలవర్షం కురిపించారు. 26వ జాతీయ యూత్ ఫెస్టివల్‌ను కర్ణాటక ప్రభుత్వంతో కలిసి జనవరి 12 నుంచి 16 వరకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ కర్ణాటకలోని హుబ్బల్లి-ధార్వాడ్‌లో నిర్వహిస్తోంది.

click me!