
న్యూడిల్లీ: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఇమ్రాన్ ఘర్హి పేరును చేర్చడంపై బీజేపీ తీవ్రంగా మండిపడింది.
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల హత్యకు గురైన అతిక్, అష్రఫ్ సోదరులతో ఇమ్రాన్ ఘర్హి కి సంబంధాలున్నాయని బీజేపీ ఆరోపించింది. అతిక్, ఆస్రఫ్ లను ఇమ్రాన్ ఘర్హి సోదరులుగా, గురువుగా భావించేవాడని బీజేపీ ఎంపీ శోభ కరంధ్లాజే ఆరోపించారు. గురువారంనాడు ఆమె ఈ విషయమై మీడియాతో మాట్లాడారు. నేరస్తులకు , దేశ వ్యతిరేకులకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందని బీజేపీ ఎంపీ శోభ ఆరోపించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ తన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఇమ్రాన్ పేరును చేర్చడాన్ని బీజేపీ ఎంపీ శోభ తప్పుబట్టారు.
ఈ ఏడాది మే 10వ తేదీన కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల కోసం బుధవారంనాడు కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడదుల చేసింది. మొత్తం 40 మంది పేర్లను కాంగ్రెస్ ప్రకటించింది. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, మల్లికార్జున ఖర్గే, జగదీశ్ శెట్టర్, డీకే శివకుమార్, సిద్దరామయ్య, శశిథరూర్ , రణదీప్ సూర్జేవలా, కేసీ వేణుగోపాల్, జైరాం రమేష్, ఆశోక్ గెహ్లాట్ ఛత్తీస్ ఘడ్, హిమాచల్ ప్రదేశ్ సీఎంల పేర్లను స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో చేర్చారు.స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో సచిన్ పైలెట్ పేరు మాత్రం లేదు.
ఇవాళ బీజేపీ తన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా పలువురు కీలక నేతలను బీజేపీ తన స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో చేర్చింది.