ఇక వాళ్లు బలవంతులు కాదు: సుబ్రమణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Jan 27, 2021, 4:30 PM IST
Highlights

ఢిల్లీలో రైతులు, పోలీసుల మధ్య తలెత్తిన ఘర్షణలపై బీజేపీ సీనియర్ నేత, ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి తనదైన శైలిలో స్పందించారు. బీజేపీ నేతలు ఇకనైనా మేలుకోవాలంటూ ఆయన పిలుపునిచ్చారు. 

ఢిల్లీలో రైతులు, పోలీసుల మధ్య తలెత్తిన ఘర్షణలపై బీజేపీ సీనియర్ నేత, ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి తనదైన శైలిలో స్పందించారు. బీజేపీ నేతలు ఇకనైనా మేలుకోవాలంటూ ఆయన పిలుపునిచ్చారు.

ఈ మేరకు బుధవారం ఉదయం వరుస ట్వీట్లు చేశారు. ట్రాక్టర్ పరేడ్‌తో ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలపై ఉన్న బలవంతులు అనే ముద్రకు నష్టం వాటిల్లిందని స్వామి అన్నారు.

‘‘రైతుల ఆందోళన కారణంగా ప్రధానంగా ఇద్దరు భాగస్వాముల గౌరవం దెబ్బతిన్నది. ఒకటి, పంజాబ్ కాంగ్రెస్, అకాలీ రాజకీయ నేతలు, వారి మధ్యవర్తులు. రెండోది, మోదీ- షా ‘‘బలవంతులు’’ అనే ముద్ర. లాభపడింది ఎవరు అంటే.. నక్సలైట్లు, డ్రగ్స్ ముఠాలు, ఐఎస్ఐ, ఖలిస్తానీలేనని ఎద్దేవా చేశారు. ఇకనైనా బీజేపీ మేలుకోవాలని స్వామి ట్వీట్ చేశారు.

మరోవైపు ఢిల్లీలో శాంతి భద్రతల ‘‘వైఫల్యం’’పైనా స్వామి విమర్శలు సంధించారు. రిపబ్లిక్ డే వేడుకలను నిలిపివేయాలని తాను ముందుగానే అనేక మార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేశానని ఆయన గుర్తుచేశారు.

భారత్‌ను మరింత బలహీనం చేసేందుకు ఈ మార్చి- మేలో చైనా భారీ దాడి చేయవచ్చని స్వామి అనుమానం వ్యక్తం చేశారు. హిందువులను ముట్టడి చేస్తారని... ఇకనైనా మేలుకోవాలని ఆయన హెచ్చరించారు.

కాగా, రైతులు పిలుపునిచ్చిన ట్రాక్టర్ ర్యాలీ కారణంగా ఈ ఏడాది గణతంత్ర వేడుకలు రసాభాసగా మారిన విషయం తెలిసిందే. కేంద్రం తీసుకొచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ రెండు నెలలుగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులు... ట్రాక్టర్ పరేడ్ పేరుతో ఢిల్లీలో విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. 

click me!