
న్యూఢిల్లీ: దళిత సామాజిక వర్గానికి చెందిన 19 ఏళ్ల యువతిపై యాసిడ్ తో దాడి చేసి హత్య చేశారు. మృతదేహన్ని బావిలో వేశారు నిందితులు. ఈ ఘటన రాజస్థాన్ లో మహిళలు, బాలికల భద్రతకు అద్దం పడుతుందని బీజేపీ విమర్శించింది.
బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ జైహింద్ ట్విట్టర్ వేదికగా ఈ విషయమై కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ ఘటన పట్ల ఆయన దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. రాజస్థాన్ ప్రభుత్వం మహిళలకు, దళితులకు ఏ రకమైన రక్షణ కల్పిస్తుందో ఈ ఘటన అద్దం పడుతుందన్నారు. ఈ విషయమై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రం కాబట్టే ఆమె మౌనంగా ఉన్నారా అని ఆయన అడిగారు.
ఈ ఏడాది జూన్ మాసంలో కోచింగ్ సెంటర్ కు వెళ్తున్న దళిత బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది.అత్యాచారం చేసిన తర్వాత బాలికను హత్య చేశారు నిందితులు. రాజస్థాన్ లోని బికనీర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన జరిగిన మూడు వారాలకే దళిత యువతిపై యాసిడ్ తో దాడి చేసి హత్య చేయడం కలకలం రేపుతోంది.