
న్యూఢిల్లీ: భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ కారుతో పాటు కాన్వాయ్గా వెళ్తున్న ఓ బైక్ రోడ్డుపైనే ఉన్న ఆవును ఢీకొట్టింది. ఆవును ఢీకొట్టిన తర్వాత పక్కనే వెళ్తున్న కారు కిందకు ఆ ద్విచక్రవాహన చోదుకుడు ప్రమాదవశాత్తు వెళ్లిపోయాడు. దీంతో ఆ యువకుడిపై నుంచి కారు వెళ్లింది. ఈ ప్రమాదంలో యువకుడు మరణించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని భోపాల్ సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది.
భీమ్ ఆర్మీ చీఫ్ రావన్ ఆదివారం మధ్యప్రదేశ్ వెళ్లారు. ఓ ప్రైవేటు ఫంక్షన్లో హాజరుకావడానికి ఆయన మధ్యప్రదేశ్ చేరుకున్నారు. ఆయన చేరగానే అక్కడే ఉన్న భీమ్ ఆర్మీ కార్యకర్తలు, రావన్ శ్రేయోభిలాషులు, అభిమానులు ఆయన వెంట కాన్వాయ్గా వెళ్లారు. కాన్వాయ్గా వెళ్లుతుండగా సాగర్- భోపాల్ రోడ్డుపై రతోనా గ్రామం దగ్గర ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. మృతుడిని శైలేంద్ర అహిర్వార్గా గుర్తించారు. ఆయన సేమదానా గ్రామానికి చెందినవాడని పోలీసులు తెలిపారు. శైలేంద్ర అహిర్వార్ బైక్ తొలుత రోడ్డుపై ఉన్న ఓ ఆవును ఢీకొట్టింది. ఆ తర్వాత ఆ బైక్ రోడ్డుపై పడిపోయిందని మోతీనగర్ పోలీసు స్టేషణ్ ఇన్చార్జీ నవల్ ఆర్య వివరించారు. ఆవును ఢీకొన్న తర్వాత శైలేంద్ర ప్రమాదవశాత్తు కాన్వాయ్లో భాగంగా వెళ్తున్న కారు కిందకు వెళ్లిపోయాడని తెలిపారు. ఆ కారు ఆయన మీద నుంచి వెళ్లిపోయిందని చెప్పారు. ఆ తర్వాత ఆ యువకుడిని సమీపంలోని హాస్పిటల్కు తరలించారని, కానీ, చికిత్స పొందుతూ హాస్పిటల్లోనే మరణించాడని వివరించారు.