
న్యూఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు బిహార్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముందు శివసేన, ఆ తర్వాత ఎన్సీపీలో చీలికలు.. నెక్స్ట్ బిహార్ అధికార పార్టీ జేడీయూనే టార్గెట్ అనే మాటలు పేలుతున్న సందర్భంలో నితీశ్లోనూ దడ పుట్టినట్టు అనుమానిస్తున్నారు. పలుమార్లు ఎన్డీఏలోకి వెళ్లి.. తిరిగి బయటికి వచ్చిన అనుభవం ఉన్న నితీశ్ మరోసారి ఆ గూటి వైపు చూస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆయన తన పార్టీ ఎమ్మెల్యేలతో వరుసగా విడిగా భేటీలు నిర్వహించడం ఈ వాదనలను బలాన్నిచ్చాయి. కానీ, ఆయన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్తో సమావేశం కావడంతో నితీశ్ కుమార్ ఎన్డీఏ వైపే చూస్తున్నారని రాజకీయ విశ్లేషకులు మరింత బలంగా చెబుతున్నారు.
ఇక్కడ హరివంశ్ గురించి చెప్పుకోవాలి. బిహార్ గత అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్ కుమార్ పార్టీ బీజేపీతో కలిసే పోటీ చేసింది. ఫలితాల తర్వాత ఎన్డీయేనే బిహార్లో అధికారాన్ని చేపట్టింది. ఈ పొత్తు సందర్భంలోనే జేడీయూ నేత హరివంశ్ను రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా నియమించారు. గతేడాది నితీశ్ కుమార్ ఎన్డీయే నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్, ఆర్జేడీ, లెఫ్ట్ పార్టీలతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా హరివంశ్ను అలాగే కొనసాగించారు.
హరివంశ్ కొనసాగింపు నితీశ్ కుమార్కు ఎన్డీయేతో ఏ సమయంలోనైనా సంప్రదింపులు జరపడానికి ఒక చానెల్గా ఉన్నది. భవిష్యత్లో ఎప్పుడైనా మళ్లీ ఎన్డీయేతో చేతులు కలపాలని అనుకుంటే హరివంశ్ ద్వారా చర్చలు జరపడానికి ఒక అవకాశం తెరిచే ఉంచుకున్నారు.
Also Read: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ స్ట్రాటజీ ఖరారైనట్టేనా?
నితీశ్ కుమార్ ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఎప్పుడూ హరివంశ్తో భేటీ కాలేదు. కానీ, తాజాగా ఆయన హరివంశ్తో సమావేశం కావడం, జేడీయూ ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించడం రాజకీయ వర్గాల్లో చర్చనీ యాంశమైంది. ఆయన విపక్షాల ఐక్యతను వదిలిపెట్టి ఎన్డీయే గూటిలోకి వెళ్లబోతున్నారని మాట్లాడుకుంటున్నారు.
ఆర్జేడీ, కాంగ్రెస్లపై గెలిచి.. మళ్లీ వారితోనే పొత్తు పెట్టుకోవడం కొందరు జేడీయూ ఎంపీల్లో ఆందోళనలను రేకెత్తిస్తున్నాయి. వారితోనే కలిసి ఉంటే తమ టికెట్లు గల్లంతయ్యే ప్రమాదం ఉన్నదని అనుకుంటున్నారు. అదీగాక, పట్నా విపక్షాల సమావేశంలో కాంగ్రెస్ పెత్తనం వహించడం వారికి మింగుడుపడటం లేదు. ఇలాంటి సందర్భంలో మహారాష్ట్ర ఆపరేషన్ జరిగితే మాత్రం తమ పార్టీలోనూ చీలిక వచ్చే ముప్పు లేకపో లేదని నితీశ్ ఆలోచించి ఉంటాడని, అందుకే మళ్లీ యూటర్న్ కోసం యోచిస్తున్నట్టు కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.