
Konanakunte police station: భార్యాభర్తల మధ్య గొడవలు సాధారణం.. కానీ కొన్ని సమయాల్లో ఈ గొడవలు కాస్తా ముదిరి ఘర్షణకు దారి తీస్తాయి. ఇదే నేపథ్యంలో చోటుచేసుకున్న భార్యాభర్తల మధ్య గొడవలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. గొడవపడుతున్న సమయంలో భర్త తన భార్య వేలిని కొరికి తినేశాడు. బాధితురాలి ఫిర్యాదులో కేసు నమోదుచేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ షాకింగ్ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది.
వివరాల్లోకెళ్తే.. గొడవలో భార్య వేలిని కొరికి మింగిన భర్తపై పోలీసులు కేసు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్న ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. భర్తపై నగరంలోని కోననకుంట పోలీస్ స్టేషన్ లో మహిళ ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన జూలై 28న జరిగినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడైన భర్త విజయకుమార్ పై చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. కాగా, పుష్ప, విజయ్ కుమార్ ల దంపతులకు 23 ఏళ్ల క్రితం వివాహమైంది. పెళ్లయినప్పటి నుంచి నిందితుడు భార్యను శారీరకంగా, మానసికంగా హింసించేవాడు. వేధింపులు భరించలేక కొంతకాలం క్రితం ఆ మహిళ ఇంటి నుంచి బయటకు వెళ్లి వేరుగా జీవించడం మొదలుపెట్టింది.
అయితే, ఈ జూలై 28న విజయకుమార్ పుష్ప ఇంటికి వెళ్లి గొడవకు దిగాడు. వాదోపవాదాల వేడిలో ఆమె ఎడమ చేతి వేళ్లను కొరికి తిన్నాడని ఫిర్యాదులో మహిళ పేర్కొంది. భార్య వేలిని తిన్నట్లే చంపేస్తానని, ఆ తర్వాత తనను తింటానని బెదిరించాడని మహిళ ఆరోపించింది. రౌడీషీటర్ల తో బాధితురాలిని బెదిరించాడని కూడా పేర్కొంది. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టారు.