Manipur: మ‌ణిపూర్ లో నిరసనకారులు, భద్రతా బలగాల మధ్య ఘర్షణ.. 17 మందికి గాయాలు

Published : Aug 03, 2023, 05:39 PM IST
Manipur: మ‌ణిపూర్ లో నిరసనకారులు, భద్రతా బలగాల మధ్య ఘర్షణ.. 17 మందికి గాయాలు

సారాంశం

Bishnupur: మణిపూర్ లోని బిష్ణుపూర్ లో ఆందోళనకారులు, భద్రతా దళాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో 17 మందికి గాయాలు అయ్యాయి. ఈ క్ర‌మంలోనే ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్ జిల్లా మేజిస్ట్రేట్లు గతంలో ప్రకటించిన కర్ఫ్యూ సడలింపులను ఉపసంహరించుకున్నారు. ఇంఫాల్ లోయ అంతటా రాత్రిపూట కర్ఫ్యూతో పాటు పగటిపూట ఆంక్షలు విధించారు.  

Manipur Fresh Clash: మణిపూర్ లోని బిష్ణుపూర్ లో ఆందోళనకారులు, భద్రతా దళాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో 17 మందికి గాయాలు అయ్యాయి. ఈ క్ర‌మంలోనే ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్ జిల్లా మేజిస్ట్రేట్లు గతంలో ప్రకటించిన కర్ఫ్యూ సడలింపులను ఉపసంహరించుకున్నారు. ఇంఫాల్ లోయ అంతటా రాత్రిపూట కర్ఫ్యూతో పాటు పగటిపూట ఆంక్షలు విధించారు.

వివ‌రాల్లోకెళ్తే.. దాదాపు మూడు నెల‌లుగా కూకీ-మైతీ తెగ‌ల జాతి ఘ‌ర్ష‌ణ‌ల‌తో మ‌ణిపూర్ అట్టుడుకుతోంది. వంద‌ల మంది ప్రాణాలు కోల్పోయారు. వేల మంది నిరాశ్ర‌యుల‌య్యారు. హింసాత్మ‌క ఘ‌ర్ష‌ణ‌ల భ‌యంతో పెద్ద సంఖ్య‌లో ప్ర‌జ‌లు రాష్ట్ర స‌రిహ‌ద్దులు దాటారు. ఈ క్ర‌మంలోనే మణిపూర్ లోని బిష్ణుపూర్ లో ఆందోళనకారులకు, భద్రతా దళాలకు మధ్య గురువారం జరిగిన ఘర్షణలో 17 మంది గాయపడ్డారు. బిష్ణుపూర్ జిల్లాలోని కాంగ్వాయ్, ఫౌగక్చావో ప్రాంతాల్లో రెండు వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగడంతో భారత సైన్యం, ఆర్ఏఎఫ్ సిబ్బంది బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్న ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్ జిల్లా మేజిస్ట్రేట్లు ఆ ప్రాంతంలో మళ్లీ కర్ఫ్యూ విధించారు.

తాజా ఘ‌ర్ష‌ణ‌లు ఎందుకు జ‌రిగాయి..?

మైతీ కమ్యూనిటీకి చెందిన మహిళలు, స్థానికులు పెద్ద సంఖ్యలో బిష్ణుపూర్ నుండి చురాన్ చంద్ పూర్ వైపు ర్యాలీగా వెళ్లడానికి ప్రయత్నించగా, ఆ ప్రాంతంలో శాంతిభద్రతలను పరిరక్షించడానికి భద్రతా దళాలు అడ్డుకోవడంతో ఘర్షణలు చెలరేగాయి. పరిస్థితి అదుపు తప్పకుండా అస్సాం రైఫిల్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది రంగంలోకి దిగి చ‌ర్య‌లు తీసుకున్నారు. బలగాలు ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటేందుకు పెద్ద సంఖ్యలో మహిళలు ప్రయత్నించడం కనిపించింది. జనం అడ్డంకులను బద్దలు కొట్టి భద్రతా దళాలపై రాళ్లు రువ్వేందుకు ప్రయత్నించగా బలగాలు బాష్పవాయువు ప్రయోగించాయి. అనంతరం జనాన్ని అదుపులోకి తెచ్చి అక్కడి నుంచి చెదరగొట్టారు.

కర్ఫ్యూ సడలింపులు ఉపసంహరించుకున్న ప్ర‌భుత్వం..

తాజా ఘ‌ర్ష‌ణ‌ల నేప‌థ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఇంఫాల్ తూర్పు, పశ్చిమ జిల్లాల్లో కర్ఫ్యూ సడలింపులను మణిపూర్ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఇంఫాల్ ఈస్ట్, వెస్ట్ జిల్లా మేజిస్ట్రేట్లు అల్లర్లు తలెత్తే అవకాశం ఉందని భావించి పగటి పూట కర్ఫ్యూ విధిస్తూ వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలావుండగా, హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) ఈ విషయాన్ని పరిశీలిస్తామనీ, ఏడు రోజుల్లో పరిష్కరించడానికి అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపింది.

PREV
click me!

Recommended Stories

బెస్ట్ కాలేజ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? | CS Sharma | Access Career Counselors | Asianet News Telugu
MBA, PGDM.. ఏది చదివితే కెరీర్ బాగుంటుంది?| CS Sharma | Access Career Counselors| AsianetNews Telugu